Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు డిసెంబర్ 31తోనే ముగిసిందనీ, దీని పొడగింపు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ఆ కమిటీ నేతలు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఉద్యోగులు, పింఛనర్ల ఆరోగ్యకార్డులపై నగదు రహిత వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో 19రోజులుగా ఉద్యోగులు, పింఛనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు సీహెచ్ రాములు, చావ రవి, మాణిక్రెడ్డి (టీఎస్యూటీఎఫ్), బి కొండల్రెడ్డి (టీపీటీఎఫ్), ఎం రఘుశంకర్రెడ్డి (డీటీఎఫ్), పోచయ్య(ఎస్టీఎఫ్ఐ), నారాయణ రాజు(టీఎస్పీటీఏ) తదితరులు పాల్గొన్నారు.