Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల మందు తాగిన వైనం
- వరంగల్ రూరల్ జిల్లాలో ఘటన
- పెండ్లికి పెద్దలు ఒప్పుకోరని..
నవతెలంగాణ-నర్సంపేట
వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెండ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఇరువురి ఇండ్లల్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. కానీ వేర్వేరు సామా జిక తరగతులు పెండ్లికి అడ్డువస్తాయని భావించి వెనక్కి తగ్గారు. అలా అని ఒకరినొకరు వదిలి ఉండలేకపోయారు. పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో
శుక్రవారం జరిగింది. దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామానికి చెందిన కొలుగూరి భరత్(25), ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన షేక్ నజ్మీన్(22) పీజీ పూర్తి చేశారు. భరత్ నర్సంపేటలో ఇండియన్ సాఫ్ట్ స్కిల్స్ పేరుతో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. నజ్మీన్ అదే సంస్థలో ఫ్యాకల్టీగా పని చేస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో నజ్మీన్కు తల్లిదండ్రులు పెండ్లి సంబంధాలు చూశారు. ఈ విషయాన్ని ఆమె భరత్కు చెప్పింది. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పిద్దామని భావించారు. కానీ వేర్వేరు సామాజిక తరగతులు తమ పెండ్లికి అడ్డువస్తాయని సంకోచించి వెనక్కితగ్గారు. ప్రేమ పెండ్లికి తల్లిదండ్రులు అంగీకరించరని మనస్తాపానికి గురై ఈ నెల 17న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని భరత్ తన బాబాయి అయిన కొలుగూరి శాంతికి ఫోన్ద్వారా సమాచారం అందించాడు. శాంతి హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిద్దరిని ఏరియాస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫలితం లేక గురువారం రాత్రి భరత్ మృతి చెందాడు. మరో అరగంటకే నజ్మీన్ కూడా మృతి చెందింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నర్సంపేట సీఐ దేవేందర్ రెడ్డి తెలిపారు.