Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై ప్రాంతీయ కార్యాలయంలో అటవీ, పర్యావరణ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ నిర్మాణానికి చెన్నైలోని కేంద్ర అటవీ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనుల కోసం 1,531 హెక్టార్లు (3,781) ఎకరాల అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులను కేంద్ర అటవీ శాఖ ఇచ్చింది. అటవీ, పర్యావరణ సాధికార కమిటీ సమావేశంలో సీతారామా ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డాక్టర్ ఎం.ఆర్.జీ. రెడ్డి చైర్మన్గా ఉన్న ఈ కమిటీ సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రానికి సానుకూలంగా సిఫారసు చేసింది. కేంద్రం దీనిపై తుది ప్రకటన చేయాల్సి ఉన్నది. ఇది పూర్తయిన వెంటనే అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేస్తారని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయనున్నారు. ప్రాజెక్టులోని పైపు లైన్లు, గ్రావిటీ కాల్వలు, కాల్వలపై ఇతర నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూటరీలు, టన్నెల్స్ నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది.
మంత్రి హరీశ్రావు హర్షం...
సీతారామ ప్రాజెక్టుకు స్టేజ్ 1 కు అటవీ అనుమతులు లభించడం పట్ల ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీతారామా ప్రాజెక్టు స్టేజ్ 1 కు అటవీ అనుమతులు వచ్చినందున స్టేజ్ 2 కు చెందిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. అలాగే ఎకో సెన్సిటివ్ జోన్లోని అటవీ భూమిలో నిర్మాణాలకు కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమతి కోసం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. సీతారామ ప్రాజెక్టు స్టేజ్ 2 కు చెందిన అటవీ అనుమతులు కూడా త్వరలో లభించనున్నట్టు మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్య ప్రాణి అనుమతులు, పంప్ హౌజ్ లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని చెప్పారు. 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనునుందని చెప్పారు. ఇకపై రెగ్యులర్ గా సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష జరపనున్నట్టు హరీశ్ రావు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4050 ఎకరాలను కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల జిల్లాలలో గుర్తించామని మంత్రి తెలియజేశారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని హరీశ్రావు చెప్పారు. ప్రత్యామ్నాయ అటవీ భూములలో అడవులు పెంచేందుకు అవసరమయ్యే నిధులను అంచనా వేసి ఇరిగేషన్ శాఖకు వెంటనే సమర్పించాలని అటవీ శాఖను మంత్రి కోరారు.