Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.70 లక్షల మంది పాత మేట్ల తొలగింపు
- మార్పులు, చేర్పుల పేర అక్రమాలు
- కొత్తవారికి గౌరవ వేతనాలు?
- ఎన్నికల నేపథ్యంలో లబ్ది
* బి. బసవపున్నయ్య
రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కార్యకర్తలకు అప్పనంగా దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, యువ తకు కార్పొరేషన్, నామినేటేడ్ పదవు లను పంచిపెడుతున్న ప్రభుత్వం, అదే పద్ధతిలో గ్రామీణ స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు సైతం వక్రమార్గం లో లాభం చేకూర్చే పనికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గులాబీ కార్యకర్త లకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పను లను చేయించే మేట్లుగా అవకాశం కల్పించింది. కూలీలకు పని కల్పించడం లేదని, అవినీతికి పాల్ప డుతున్నారనే నెపంతో పాత మేట్లను తొలగించింది. ఖాళీ అయిన ఆ స్థానాలను టీఆర్ఎస్ శ్రేణులకు ఎరగా వేయడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియమించారు. అంతేగాక, ఇప్పటిదాకా పాతమేట్లకు ఇవ్వని విధంగా కొత్తవారికి గౌరవవేతనాలు ఇచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నది. తద్వారా ఉపాధి హామీ నిధులను గౌరవవేతనంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు మళ్లించేందుకు సిద్ధమౌతోంది. పాతమేట్ల పేర్లు రికార్డుల్లో కూడా లేకుండా చేసింది. కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించి టీఆర్ఎస్ కార్యకర్తల పేర్లు నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గతేడాది అక్టోబరు 18న సర్క్యులర్ నెం.1786/ ఇ.జి.ఎస్/పి. ఎం(ఎస్.పి)/2016 పేర జారీ చేసింది.
చట్టం పరిస్థితి..
రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం 30 జిల్లాల్లో అమలవుతోంది. 437 మండలాల్లోని 8751 పంచాయతీల్లో పనులు చేపట్టారు. 21,390 ప్రదేశాల్లో పనులు చేస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెప్పారు. ఒక్కో సంఘంలో 10 నుంచి 30 మంది వరకు కూలీలు సభ్యులుగా ఉంటారు. దాదాపు 51 లక్షల మందికి జాబ్కార్డులు జారీ చేశారు. ఇందులో ఆయా ప్రభుత్వ పథకాల లబ్దిదారులు సైతం ఉన్నారు. వీరిలో సుమారు 45 లక్షల మంది కూలీల వరకు ఉపాధి హామీ పనులకు హాజరవుతారని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.
మేట్లు ఏం చేస్తారు ?
ఉపాధి హామీ చట్టం పనుల్లో మేట్లది కీలకపాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా 3.28 లక్షల మంది మేట్లు ఉన్నారు. ఒక్కో శ్రమశక్తి సంఘానికి ఒక మేట్ నాయకత్వం వహిస్తారు. గ్రామాల్లో కూలీలకు పని కల్పించడమే వారి ప్రధాన విధి. కూలీలను సమన్వయం చేయడం, పనుల కోసం దరఖాస్తు పెట్టించడం, జాబ్కార్డులు ఇప్పించడం తదితర పనులు చేయాల్సి ఉంది. ఇన్ని పనులు చేసినా వీరికి నెల జీతం కూడా లేదు. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో కూలీకి వచ్చే వేతనం నుంచి రూ.3 మేట్లకు ఇచ్చేవారు. అది టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తరువాత కొద్దికాలం కొనసాగింది. ఆనక ఎత్తేశారు. అయితే 100 రోజుల పని పూర్తి చేసిన కూలీల కూలి నుంచి మాత్రమే కొంతకాలం ఇచ్చారు. ఆ తరువాత దాన్నీ రద్దు చేశారు. అవినీతికి పాల్పడుతున్నారని, కూలీలు రాకపోయినా మస్టరు రాస్తున్నారనే నెపంతో అధికారులు ఈ తరహా నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నది.
ఇప్పుడు ఏం జరుగుతున్నది..
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధి మేట్లను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. శ్రమశక్తి సంఘాలకు ప్రస్తుతం 3.28 లక్షల మంది మేట్లు నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇప్పటికే దాదాపు 55 శాతం అంటే సుమారు 1.70 లక్షల మంది మేట్లను తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు. వారి జాబ్కార్డులనూ రద్దు చేశారు. సర్క్యులర్ జారీ చేసి దాదాపు మూడు నెలలు అవుతున్నది. మరో నెల రోజుల్లో మొత్తం పాత మేట్లను తొలగించి పూర్తిస్థాయిలో కొత్తవారిని పెట్టుకునే కార్యక్రమం ప్రభుత్వం పూర్తిచేయనుంది. ఈ కొత్త మేట్ల నియామకాల్లో దాదాపు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రజాసంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక వీరికి గౌరవ వేతనం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
కొత్తవారు పనులు ఎలా చేయగలరు..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద అదనంగా పనిదినాలు కావాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్రానికి నివేదిక పంపింది. ఈ మేరకు రెండోసారి నివేదిక సమర్పించింది. కొన్నేండ్లుగా చేపట్టిన పనులను, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న పనులను ఆ నివేదికలో వివరించారు.
2016-17లో ఉపాధి పనుల కోసం రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పని దినాలను కేంద్రం మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.2100 కోట్లు వ్యయమైంది. అదనంగా మరో 2 కోట్ల పనిదినాలు అంటే మొత్తం 14 కోట్ల పనిదినాలు కావాలని తాజాగా ఇచ్చిన నివేదికలో తెలియజేశారు. అంటే సుమారుగా రూ.3000 కోట్లు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, అనుభవం లేని కొత్త మేట్లు పెరుగుతున్న పనులను ఎలా చేయగలుగుతారనే ప్రశ్న ప్రజాసంఘాల నుంచి వస్తున్నది. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులో లేరు.
పాతమేట్లనే కొనసాగించాలి బి. ప్రసాద్, ఆర్.వెంకటేశ్వర్లు
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి
కేవలం ఒక్క సర్క్యులర్ ద్వారా లక్షలాది మంది మేట్ల జీవితాలను ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. అవినీతికి పాల్పడుతున్నారని చెప్పడం సరికాదు. ఈ సాకుతో టీఆర్ఎస్ కార్యకర్తలను కొత్త మేట్లుగా పెడుతోంది. వారికి గౌరవ వేతనం ఇవ్వాలని ఆలోచిస్తున్నది. పేద మేట్లను ఒకేసారి తొలగించడం, జాబ్కార్డులను రద్దు చేయడం సహించరానిది. వ్యవస్థను సరిచేసి, పాత మేట్లను కొనసాగించి, వారికే గౌరవ వేతనం ఇవ్వాలి. బకాయిలు వెంటనే చెల్లించాలి.