Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శస్త్రచికిత్స చేశాక పర్యవేక్షించని వైనం
- చేయిదాటాక ప్రయివేటుకు తరలింపు
- బాధిత కుటుంబానికి మద్దతుగా సీపీఐ(ఎం), ఐద్వా ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇన్ఫెక్షన్తో తీవ్ర రక్తస్రావం అయ్యి బాలింత మృతిచెందింది. దీనికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతుగా సీపీఐ(ఎం), ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన కె.జ్యోతి ఈనెల 15న రాత్రి 10 గంటల సమయంలో డెలివరీ నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు అదేరోజు రాత్రి 2 గంటలకు ఆపరేషన్ చేసి కవలపిల్లలను బయటకు తీశారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్తో జ్యోతికి తీవ్ర రక్తస్రావం అయింది. విషయాన్ని వైద్యురాలు రోహిణి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మరోసటి రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కలెక్టర్, డీఎంఅండ్హెచ్వో వచ్చి పరిశీలించి డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన వైద్య పరికరాలు ఇక్కడ లేవని, తామే వైద్య ఖర్చంతా భరిస్తామని చెప్పి వారు జ్యోతిని ఓ ప్రయివేటు ఆస్పత్రికి పంపించారు. కానీ అప్పటికే పరిస్థితి మిషమించడంతో శనివారం తెల్లవారుజామున ప్రయివేటు ఆస్పత్రిలో జ్యోతి మృతిచెందింది. సర్కారు ఆస్పత్రిలో సరిగ్గా పట్టించుకొని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని జ్యోతి భర్త నాగేష్ కన్నీరుమున్నీరయ్యారు. దీంతో జన్మించిన కవల పిల్లలు అనాథలయ్యారు. అయితే, వైద్య ఖర్చులు తామే భరిస్తామన్న డీఎంఅండ్హెచ్వో తర్వాత పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు ఆస్పత్రిలో రెండు లక్షల రూపాయలకు పైగా బిల్లు అయిందని, తమ వద్ద అంత లేకపోవడంతో అక్కడా సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తున్నారు. బిల్లు కోసం డీఎంఅండ్హెచ్వో దగ్గరకు పోతే కలెక్టర్తో మాట్లాడాక చెబుతామని తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం), ఐద్వా ధర్నా
జ్యోతి కుటుంబానికి మద్దతుగా సీపీఐ(ఎం), ఐద్వా నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత ప్రాణం కోల్పోయిందని, దీనికి బాధ్యులైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్బాబు డిమాండ్ చేశారు. సదరు డాక్టర్లపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఐద్వా జిల్లా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సబ్బనిలత డిమాండ్ చేశారు.