Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత, బహుజనులకిచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదు : బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణలో నల్లా సూర్యప్రకాశ్
నవతెలంగాణ- యంత్రాంగం
మిషన్ కాకతీయ పనుల్లో రూ. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సూర్యప్రకాశ్ విమర్శించారు. మూడున్నరేండ్ల కాలంలో దళితులకు, బహుజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బీఎల్ఎఫ్ సమావేశం శనివారం నిర్వహించారు. పలు సంఘాల నాయకులతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డిని కాంగ్రెస్ చేర్చుకుందంటేనే ఆ పార్టీ దిగజారుడుతనం ఏంటో అర్థమవుతోందన్నారు. 2019లో బీఎల్ఎఫ్దే రాజ్యాధికారమన్నారు. అనంతరం బీఎల్ఎఫ్ ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు వర్దం పర్వతాలు, బీసీ సబ్ప్లాన్ నాయకులు కిల్లెగోపాల్, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు పాషా, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు నిరంజన్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మాణిక్బాబు, టీమాస్ జిల్లా కన్వీనర్ దేశ్యానాయక్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిటైర్ట్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా నల్లా సూర్యప్రకాశ్ హాజరయ్యారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జబ్బార్, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో, సంగారెడ్డిలోని కేకే భవన్లో జరిగిన బీఎల్ఎఫ్ సన్నాహాక సమావేశాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ... ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందన్నారు. 2019లో బూర్జువా పార్టీలను అధికారంలోకి రాకుండా చేయటమే తమ లక్ష్యమన్నారు. రెండుచోట్లా బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) మెదక్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శులు ఏ.మల్లేశం, బీరం మల్లేషం, తెలంగాణ లేబర్పార్టీ అధ్యక్షులు జి.రమేశ్, లోక్సత్తా తెలంగాణ అధ్యక్షులు నాగరాజు, మహాజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, రిటైర్ట్ ఉద్యోగుల సంఘం నాయకులు దేవయ్య, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.