Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100కోట్లు : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- న్యాయవాదులకు హెల్త్ కార్డులందించేందుకు కృషి: మంత్రి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-మహబూబ్నగర్
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టును జూన్లోపు విభజిస్తామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించనున్నట్టు చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశానికి మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల కోసం ఏం చేయలేకపోతున్నామని, హైకోర్టు విభజన తర్వాత వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. సెక్షన్ 41(ఎ) సీఆర్ పీసీని రాష్ట్ర ప్రభుత్వం చర్చించి సవరణ చేయడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు వివరించారు. మహబూబ్నగర్ జిల్లా అసోసియేషన్ వారు కోరిన 8 డిమాండ్లను తప్పనిసరిగా నెరవేరుస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. హెల్డ్కార్డులివ్వాలని అన్ని రంగాల నుంచి డిమాండ్ వస్తోందని, న్యాయ వాదులకూ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అన్నారు. జిల్లా కోర్టు పక్కన ఉన్న రెవెన్యూ స్థలాన్ని ఇప్పించి కొత్తకోర్టును నిర్మిస్తామని హామీనిచ్చారు. సభలో ఎంపీ జితేందర్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. 2010లో చలో ఢిల్లీ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన న్యాయ వాదులను మంత్రులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసి యేషన్ జిల్లా కార్యదర్శి గడ్డం గోపాల్, న్యాయశాఖ మాజీ మంత్రి చంద్ర శేఖర్, సీనియర్ న్యాయవాది మనోహర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.