Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సీప్లేన్' సినిమాతో తెరపైకి వచ్చిన కాషాయదళం
- భారత్ కు పరిచయం చేసింది మోడీనే అంటూ డాంబికాలు
- గతంలో చతికిలపడిన పలుదేశీయ 'సీప్లేన్' ప్రాజెక్టులు
- సీప్లేన్ పై ప్రభుత్వం చెబుతున్నవన్నీ అభూతకల్పనలేనంటున్న పరిశీలకులు
- సముద్ర విమానంపై అత్యుత్సాహం చూపుతోన్న 'స్పైస్జెట్'
ప్రజాక్షేత్రంలో విఫలమై.. ఆర్దిక, సాంకేతిక నిపుణుల నుంచి పెదవి విరుపులకు లోనైన ఎన్నో ప్రాజెక్ట్ లను.. మసిపూసి మారేడుకాయ చేస్తూ, తామే దేశానికి మొదటి సారిగా పరిచయం చేశామన్నట్టు డాంబికాలకు పోవడం బీజేపీ ఉద్దండులకు కొత్తేమీ కాదని 'సీప్లేన్' వ్యవహారంతో మరోసారి రుజువైంది. ఆ వైమానిక వైచిత్రిపై 'నవతెలంగాణ' స్పెషల్ ఫోకస్..
* జై
మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తూ.. సామాన్యుడి నడ్డివిరిచేలా చేశాయని ఇప్పటికే ప్రముఖ ఆర్దిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా తెరపైకి తెచ్చిన 'సీప్లేన్ (సముద్ర విమానం)' వ్యవహారం పలు విమర్శలకు తావిస్తున్నది.
సీప్లేన్ - లాభమెంత?:
గత డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్లోని సబర్మతీ నది నుంచి ధరోరు డ్యామ్ వరకూ ప్రధాని నరేంద్ర మోడీ సీప్లేన్లో ప్రయాణించడం.. దాన్ని అదునుగా చేసుకొని కొందరు అధికార పార్టీ నేతలు.. 'రవాణా రంగంలో సముద్ర విమానం/యాంఫీబియన్ ఎయిర్క్రాఫ్ట్ (సీప్లేన్) ఒక పెద్ద విప్లవమని, సీప్లేన్ల ద్వారా ఎన్నో లాభాలు, అవకాశాలున్నాయ'ని ఊదరగొట్టడం తెలిసిందే! ఐతే, సీప్లేన్ల వల్ల అంతటి లాభాలు, అవకాశాలున్నప్పుడు.. అన్ని దేశాలు సీప్లేన్లను పూర్తి స్థాయిలో నడపకుండా.. కొన్ని ప్రాంతాలకే ఎందుకు పరిమితం చేసినట్టన్న సందేహం మన నేతలకు రాకపోవడం నిజంగా విడ్డూరం.
విమానాలు ల్యాండ్/టేకాఫ్ అవడానికి అవసరమైన రన్ వేలు లేని చిన్న దేశాలు/ ద్వీపాలు మాత్రమే సీప్లేన్లను నడపడానికి ఆసక్తి చూపుతున్నాయని, మిగతా దేశాలు సీప్లేన్ లను అత్యవసర సమయాల్లో(అగ్ని ప్రమాదాల నియంత్రణ), ప్రముఖుల వ్యక్తిగత అవసరాలు, ప్రభుత్వ కార్యక్రమాలు మొదలైన వాటికే ఎక్కువ శాతం వినియోగిస్తున్నాయని వైమానిక సంస్థల గణాంకాలను చూస్తే తెలుస్తోంది.
సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన భారతనగరాల్లో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయలు/ వైమానిక సదుపాయాలు ఉన్నాయని తెలిసిందే! కాబట్టి, ఆయా ప్రాంతాల్లో సీప్లేన్ల అవసరం లేదు. ఇక, ద్వితీయ/త తీయ శ్రేణి నగరాల్లో సీప్లేన్లను ప్రవేశపెట్టినా.. ఇతర రవాణా సర్వీసులతో పోల్చి చూస్తే, అత్యంత ఖరీదైన సీప్లేన్ ప్రయాణాన్ని ఎంతమంది( ఈప్రాంతాల్లో నివసించే ప్రజల ఆదాయాన్ని అనుసరించి) ఆదరిస్తారో సందేహమే! నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోకపోతే సీప్లేన్ నిర్వాహక సంస్థలు కూడా ఆర్దికంగా నష్టపోవాల్సిందే! అన్నిటికీ మించి.. ఒక్క ఇంజిన్ కలిగి, ఆరేడుగురు కంటే ఎక్కువ ప్రయాణ సామర్థ్యం లేని సీప్లేన్లను భారత్ వంటి సువిశాల భూభాగం గల దేశంలో ఇప్పుడు తీసుకురావడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని?? పర్యాటకాన్ని ప్రోత్సహించడాన్ని సాకుగా చూపెడుతూ, పేరు కోసం, అనుయాయులకు లబ్దిచేకూర్చడం కోసం.. ప్రజాధనాన్ని వృథా చేస్తూ.. సీప్లేన్లను తీసుకురావడం కరెక్ట్ కాదని, గతంలో సీప్లేన్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలను చూసి ప్రభుత్వం సదరు విషయంపై పునరాలోచించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మన దేశంలో ఎప్పుడో ప్రారంభమయ్యి.. ఆగిపోయాయి :
నేతలు చెబుతున్నట్టు మన దేశానికి గౌరవ ప్రధాని వల్ల సీప్లేన్ పరిచయం అయిందన్నది అతిపెద్ద అబద్ధం. పేరు ప్రతిష్టల కోసం పలికే డాంబికాలు నిజమైపోవు కదా! వాస్తవానికి సీప్లేన్ సర్వీసులు ఇండియాలో ఎనిమిది సంవత్సరాల కిందటే ప్రారంభమయ్యాయి. అండమాన్, నికోబార్ ప్రభుత్వ యంత్రాంగం 2010-11లో 'జలహంస' పేరిట సీప్లేన్ సర్వీసులను ప్రారంభించి.. ఆ తర్వాత 'పవన్ హంస' సంస్థతో కలిసి ఈ విమాన సర్వీసులను ప్రఫుల్ పటేల్ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంతకాలం నడిపింది.
ఐతే, ఈ సర్వీసులకు ప్రజలనుంచి తగినంత ఆదరణ రాకపోవడం, పెట్టుబడి, విమాన మరమ్మతులు, నిర్వహణ వ్యయాలు అనుకున్న దానికంటే పెరిగిపోవడంతో సదరు సీప్లేన్ సర్వీసులను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. ఇక, ఆ తర్వాత.. ఊమెన్ చాండీ కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ.. సీప్లేన్ ప్రాజెక్ట్ ను(2012-13) తలపెట్టగా.. కేరళ రాష్ట్ర మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యడం, పర్యావరణ నిపుణులు సైతం జలచరాలకు, వృక్ష సంపదకు హాని కలిగే అవకాశమున్నదని నివేదికలు ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది. పాత సారాను కొత్త సీసాలో పోసినట్టు.. గతం ఎవ్వరికీ గుర్తులేదని భ్రమించిన కాషాయదళాలు 'సీప్లేన్' కహానీకి కొత్త వేదికను ఇప్పుడు సరికొత్తగా సిద్ధం చేస్తుండటం హాస్యాస్పదం.
ఎందుకనో అంతటి ఉత్సాహం?:
సీప్లేన్లపై మిగతా విమానయాన సంస్థల కంటే స్పైస్జెట్ అమితాసక్తిని చూపిస్తుం డటం పరిశీలకులను విస్మయానికి గురిచేస్తున్నది. జపాన్ కు చెందిన సిటౌచీ హౌల్డింగ్స్ సంస్థ నుంచి మొదటి విడతలో వంద సీప్లేన్లను కొనే ఆలోచనలో ఉన్నట్టు స్పైస్జెట్ ఇప్పటికే ప్రకటించింది కూడా! ఒక్కో సీప్లేన్ ఖరీదు రమారమీ పాతిక కోట్లకు పైమాటే! దేశీయ వైమానిక రంగంలో స్పైస్జెట్ వాటా మరియు లాభాలు అంతంత మాత్రమే! మరి, కేంద్ర మంత్రుల అత్యుత్సాహానికి పరవశించి.. ఇంత పెట్టుబడి పెట్టి.. లాభాల్ని గడించకపోతే సదరు సంస్థ(స్పైస్జెట్) పరిస్థితి ఏమవుతుందోనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఏఏఐ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, పశ్చిమబెంగాల్ లో సీప్లేన్ తయారీ అవకాశాలను పరిశీలిస్తున్నామని 'బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ - 2018'లో స్పైస్జెట్ చైర్మెన్ అజరు సింగ్ తాజాగా వెల్లడించడం కొసమెరుపు.
సీప్లేన్ - ఆసక్తికర అంశాలు :
- 'భారత్ తొలి సీప్లేన్ లో ట్రావెల్ చేసిన తొలి వ్యక్తి మోడీ' అంటూ నరేంద్ర మోడీ వెబ్సైట్ ఆరాÄ్భటంగా పోస్ట్ చేసి.. పొరపాటును గ్రహించిన పిదపే సదరు వాక్యాలను మార్చినప్పటికీ.. నేతలు మాత్రం మొదటి దానికే ఫిక్స్ అవ్వడం విశేషం.
- మోడీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో.. 'స్పైస్జెట్' సంస్థ కొడైయిక్ క్వెస్ట్ సీప్లేన్ను ముంబై తీసుకొచ్చి మరీ.. గిర్గామ్ ప్రాంతంలో డిసెంబర్ 9వ తేదీనే ట్రయల్ రన్ నిర్వహించడం గమనార్హం.
- ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన సీప్లేన్ ప్రమాదంలో.. బ్రిటిష్కు చెందిన ప్రఖ్యాత క్యాటరింగ్ కంపెనీ కంపాస్ సీఈవో రిచర్డ్ కజిన్స్తోపాటు ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే!