Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు కలెక్టరేట్ల ముట్టడి
- సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలు తరలిరావాలి: టీమాస్ స్టీరింగ్ కమిటీ పిలుపు
- కలెక్టరేట్ల ముట్టడి పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించనున్నామని, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలంతా పెద్దఎత్తున తరలిరావాలని టీమాస్ స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది. వాగ్దానాల అమలుకు ప్రభుత్వం వెంటనే తేదీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్ ఆధ్వర్యంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ప్రజాగాయకులు గద్దర్ మాట్లాడుతూ..అనేక ప్రజా సంఘాలతో నిర్మితమైన టీమాస్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తోందన్నారు. కవులు, కళాకారులు, రచయితలు ప్రజా సమస్యలపై పాటలు, కవిత రాసుకుని తమ వాయిద్యాలతో కలెక్టరేట్ల ముట్టడికి మద్దతుగా రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వానికి గడువు పెడతామని అన్నారు. టీమాస్ కన్వీనర్ జాన్వెస్లీ మాట్లాడుతూ ఈ నెల రెండో తేదీ నుంచి టీమాస్ ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలను అధ్యయనం చేసిందని, టీఆర్ఎస్ ప్రభుత్వ హామీలు అమలు కాలేదని, అపరిష్కృతమైన సమస్యలతో ప్రజలు అసమానతలకు గురవుతున్నారని వెల్లడైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవసరముండగా కేవలం 4462 ఇండ్లనే పూర్తి చేశారని తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున 25 లక్షలు పంచాల్సి ఉండగా, కేవలం 12వేల ఎకరాలే పంపిణీ చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ మిగులు భూములు 80లక్షల ఎకరాలున్నాయన్నారు. ఉద్యోగాల భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, జెబీ రాజు మాట్లాడుతూ కేవలం పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఉద్యోగాలను భర్తీ చేస్తూ పోలీస్స్టేషన్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారని విమర్శించారు. ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయట్లేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాలేదని, ఆస్పత్రులు మెరుగవ్వలేదని, పీహెచ్సీలలో డాక్టర్లు లేరని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక మాఫీయా రాజ్యమేలుతోందన్నారు. స్వచ్ఛ భారత్కు బదులుగా సీఎం కేసీఆర్ జవహార్నగర్లో చెత్తను నింపుతూ చెత్త భారత్గా మారుస్తున్నారని విమర్శించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, ఎంవీ రమణ, రాష్ట్ర నాయకులు ఆర్.శ్రీరామ్ నాయక్, ఎం.ధర్మానాయక్, యాదగిరి పాల్గొన్నారు.
చిన్నకందుకూరులో దళితులపై దాడికి ఖండన
భువనగిరి యాద్రాద్రి జిల్లాలోని చిన్న కందుకూరులో ఆర్ఎస్ఎస్ గూండాలు దళితులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీమాస్ ప్రకటించింది. యాదగిరిగుట్ట మండలంలోని పది ఊర్లలో 25మందికి పైగా గూండాలు బైక్లపై తిరుగుతూ దాడులకు తెగబడటం దుర్మార్గ చర్య అని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.