Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశుధ్య కార్మికులను మోసగిస్తున్న కాంట్రాక్టర్ శ్రీ రోజుకు ఇస్తామన్నది
- రూ.450..ఇస్తున్నది రూ.350 లేదా రూ.300
- ఇచ్చిన అడ్వాన్స్లపై వడ్డీ వసూలు
- చార్జీలను కార్మికులే భరిస్తున్న వైనం
- కంపు భరించలేక రోగాలపాలవుతున్న కార్మికులు
- నిరుపయోగంగా షూస్, గ్లౌజ్లు
- వ్యర్థాలతో కంపుకొడుతున్న మేడారం
మేడారం నుండి బొక్కా దయాసాగర్
మేడారంలో కోటిన్నర సందర్శకులు విడిచివెళ్లిన టన్నుల కొద్దీ చెత్తను శుభ్రం చేస్తున్న కార్మికులు..కాంట్రాక్టర్ నిలువు దోపిడీకి గురవుతున్నారు. కంపుకొడుతున్న జంతుకళేబరాలు... పూడ్చని మరుగుదొడ్ల గుంతలు...ఆహార వ్యర్థ పదార్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో కార్మికులు రోగాల పాలవుతున్నారు. రోగాలతో బాధపడుతూ 'ఇంటికెళ్లిపోతాం. ఇంత వరకు చేసినదానికి డబ్బులివ్వండి' అని అడిగితే కాంట్రాక్టర్ కార్మికుల పట్ల కనీసం మానవత్వం కూడా చూపట్లేదు. కార్మికులకు ఇచ్చిన అడ్వాన్స్లపై వడ్డీ వసూలు చేస్తున్నాడు. చార్జీలనూ కార్మికులే భరిస్తున్నారు. కార్మికులు ఎవరి బువ్వ వారు వండుకోవాల్సిందే. రోజంతా దుర్వాసన మధ్య పొద్దస్తమానం పనిచేసి, ప్రయాణంతో అలసిపోయి కార్మికులు సరిగా తిండి కూడా తినట్లేదు. కాంట్రాక్టర్ మోసాలను తాళలేక కొందరు, రోగాల పాలై మరి కొందరు...పనిచేయలేక ఇంకొందరు వెళ్లిపోగా 2,500 మంది కార్మికులకుగానూ 200 మందే మిగిలారు. ఎకోజాతర అంటూ ఊదరగొట్టిన అధికారులు పారిశుధ్య పనులను పర్యవేక్షించట్లేదు. 'నవతెలంగాణ' మేడారంతోపాటు పరిసర గ్రామాలను సందర్శించగా...అధికారుల నిర్లక్ష్యం, లోపాలు, అవినీతి, పారిశుధ్య లోపం, కార్మికులను దోచుకోవడం బహిర్గతమయ్యాయి.
జాతర ముగిసిన అనంతరం పారిశుధ్యంపై దృష్టి కేంద్రీకరించినట్టు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, అధికారులు అందరూ ఊదరగొట్టారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పస్రా నుంచి మేడారానికి 10 కిలోమీటర్ల ముందు నుంచే రహదారికి ఎటుపక్క ఆగినా ఈగల మోతే. తపమంచా, ప్రాజెక్టునగర్, నార్లపూర్, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, మేడారం వరకు ఎక్కడ ఆగినా ఈగలు ముసరుతుండటం కనిపించింది. చెత్తా, చెదారం కుప్పలు, తెప్పలుగా పడి కనిపించాయి. మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల పరిసరాల్లోనూ ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయి. మరుగుదొడ్ల గుంతలను పూడ్చివేయలేదు. ఖాళీ మద్యం సీసాలు, ఖాళీ వాటర్ బాటిల్స్ కుప్పలు తెప్పలుగా పడి వున్నాయి. జంతు, పౌల్ట్రీ వ్యర్ధాలు ఒర్రెల్లో దర్శనమిస్తున్నాయి. అపరిశుభ్రంగా, దుర్గంధం నిండిన ఆ ప్రాంత సమీపంలో పారిశుధ్య కార్మికులు బస చేస్తున్నారు. ఆ కార్మికులకు చెందిన ప్రతి కుటుంబంలోనూ ఒకరో, ఇద్దరో వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతూ పనిచేయలేక పోతున్నారు. మరోవైపు కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించినా చిలుకలగుట్ట ప్రాంతానికి రావడానికి మరో గంట పడుతున్నది. నీళ్లు తెచ్చుకుని వంట పూర్తి చేసుకొనే వరకు మరో రెండుగంటలు పడుతున్నది. విమర్శలు వస్తున్న నేపథ్యంలో మూడు రోజుల నుంచి మాత్రమే కాంట్రాక్టర్ టిఫిన్, తాగునీరు అందజేస్తున్నాడు. ఈ లెక్కన ఉదయం టిఫిన్, సాయంత్రం ఒక్క పూట భోజనం మాత్రమే తింటూ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కోటిన్నరమంది వచ్చిన జాతరలో 3వేల మంది కార్మికులతో పనిచేయించాలని భావించారు. తర్వాత 2,500 మంది పారిశుధ్య కార్మికులతో పనులు మొదలుపెట్టగా... చివరకు 200 మందే మిగిలారు. సుమారు 2వేల ఎకరాల విస్తీర్ణానికిపైగా వున్న ఈ ప్రాంతంలో వీరితో పనులు చేయించడం ఎలా సాధ్యమనేది అర్థంకావట్లేదు. వారికి రోజుకు రూ.450 ఇవ్వాల్సి ఉండగా రూ.350 నుంచి రూ.300 మాత్రమే ఇస్తున్నారు. వారికి చార్జీలూ ఇవ్వట్లేదు. అడ్వాన్స్లపై వడ్డీ వసూలు చేసి కాంట్రాక్టరు తుపాకుల రమణ తన కర్కశత్వాన్ని చూపించారు. పారిశుధ్యానికి రూ.2.41 కోట్లు కేటాయించగా..రూ.1.40 కోట్లు కేవలం పారిశుధ్య కార్మికుల వేతనాలకే కేటాయించారు. పారిశుధ్య కార్మికుల కోసం 2 వేల షూస్ జతలు, 40 వేల గ్లౌజ్లు కొనుగోలు చేసి తీసుకొచ్చినా పారిశుధ్య విభాగం క్యాంప్లో వృథాగా పడి ఉన్నాయి. అవగాహన కల్పించకపోవడంతో కార్మికులు వాటిని ఉపయోగించట్లేదు. షూస్ రవాణాకు రూ.3 లక్షలు, వాటి రవాణాకు రూ.12 వేలు ఖర్చు చేశారు.
చార్జీలు స్వాహా..అడ్వాన్స్పై వడ్డీ...
అవినీతి రూ.50 లక్షలు
పారిశుధ్య కార్మికులను కాంట్రాక్టర్ తుపాకుల రమణ నిలువుదోపిడీ చేశాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ జాతరలో పారిశుధ్య కార్మికుల కోసం కేటాయించిన రూ. 1.40 కోట్లలో కనీసం రూ.50 లక్షలు రమణ దోపిడీ చేసే శాడని సమాచారం. కార్మికులకు జాతరకు ముందు రోజుకు రూ.350 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.250, జాతర అనంతరం రోజుకు రూ.450లకుగాను కేవలం రూ.350 -రూ.300 మాత్రమే చెల్లించాడని కార్మికులు తెలిపారు. కార్మికులకు రానుపోను చార్జీలను ప్రభుత్వం ఇవ్వగా.. సుమారు రూ.20లక్షల మేరకు కాంట్రాక్టర్ దోచుకున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కాంట్రాక్టర్ను అడగ్గా...'కార్మికులను అనేకమార్లు వివిధ ప్రాంతాల్లో తిరిగి తీసుకొచ్చా' అని దాటవేశారు. కార్మికులకు ముందుగానే ఖర్చుల కింద వారికి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు అడ్వాన్స్ ఇచ్చారు. జాతర పని ముగిశాక వారికి ఇచ్చే కూలి నుంచి అడ్వాన్స్గా ఇచ్చిన మొత్తంతో పాటు దానిపై 5 శాతం వడ్డీ వసూలు చేసుకొని మిగతా డబ్బులను మాత్రమే ముట్టచెబుతాడని కార్మికులు తెలిపారు.
బ్లీచింగ్ పౌడర్ మా ఆయన చేతిని తినేసింది
బ్లీచింగ్ పౌడర్ మా ఆయన (బజ్జె రాఘవ) చేతిని తినేసింది. వారం నుంచి పనిచేయలేకపోతుంన్నాడు. ఇంటికి వెళ్తామంటే డబ్బులివ్వటం లేదు. చార్జీల కోసం రూ.2 వేలు అప్పుచేసి వచ్చాం. 15 రోజులు పనిచేశాం. పిల్లలకు వాంతులు, విరేచనాలైతే మా మరిదితో ఇంటికి పంపించేశాం. ఇదే మొదటిసారి జాతర పని కోసం రావడం. చాలా మంది ఆరోగ్యం బాగోక ఇంటికి వెళ్లిపోయారు. డబ్బులిస్తే మేము కూడా వెళ్లిపోతాం.
- బజ్జె కరుణ (మంగళగిరి), కార్మికురాలు