Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- ఏప్రిల్ వరకూ సర్కారుకు గడువు
అప్పటికీ స్పందించకుంటే ఆందోళనలు ఉదృతం : ఎంఎస్టీఎఫ్ ధర్నాలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ టీచర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వందలాది మంది టీచర్లు హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఏప్రిల్ నుంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎంఎస్టీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు టీచర్లు బైటాయించి నిరసన తెలిపారు. ఈధర్నానుద్దేశించి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి మాట్లాడుతూ...మోడల్ స్కూళ్లను ప్రారంభించి ఐదేండ్లు గడుస్తున్నా. నేటికీ ఉద్యోగులకు సర్వీస్రూల్స్ లేవని అన్నారు. గతంలో ఎంఎస్టీఎఫ్ నిర్వహించిన ధర్నాలు, దీక్షలతో కదిలిన ప్రభుత్వం పీఆర్సీ, సెలవుల నిబంధనలు ఇచ్చిందని గుర్తుచేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సీనియారిటీ రోస్టర్ పాటించకుండా అవసరమైన చోట పోస్టింగ్లు ఇచ్చారని, దీంతో దూర ప్రాంతాల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ వేసవిలో తప్పనిసరిగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీచర్ల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తే భవిష్యత్లో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తోన్న మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించడం లేదనీ, దీంతో వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇతర సొసైటీల మాదిరిగానే మోడల్ స్కూల్టీచర్లకు సర్వీసు రూల్స్ ఉంటాయని చెబుతున్న అధికారులు, నిబంధనల విడుదలలో మాత్రం తీవ్రజాప్యం చేస్తున్నారని చెప్పారు. మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ...మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వెన్నంటి ఉంటామని అన్నారు. ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొండయ్య మాట్లాడుతూ...ముట్టడిలో టీచర్లు పాల్గొనకుండా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని, ప్రిన్సిపల్స్కు ఫోన్చేసి పంపొద్దని బెదిరించే ప్రయత్నం చేసిందని అన్నారు. అయినా రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలల నుంచి ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారని చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటం ఆగదని, ఏప్రిల్వరకు సమస్యలు పరిష్కరించకుంటే, పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్, రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, జయప్రకాష్, అశోక్ కుమార్, జగన్నాథ్, సురేష్, క్రాంతికుమార్, శ్వేత, భాస్కర్, నాగరాజు, రాంప్రసాద్, జగన్ తదితరులు పాల్గొన్నారు.