Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల స్థాయి నుంచే ఆలోచనా విధానం
- పెరిగిన ఎస్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్స్
- ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైన ఎస్పీసీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సైన్యం వైపు అడుగులు వేసే ఆలోచనలు పెంపొందించేలా విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఎస్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను పెంచగా, ఈవిద్యాసంవత్సరం నుంచి స్టూడెంట్ పోలీస్ క్యాడెట్(ఎస్పీసీ) యూనిట్లనూ ప్రారంభించింది. ఈ కార్యక్రమాలతో విద్యార్థుల్లో దేశభక్తి భావాలు పెరగడంతో పాటు క్రమశిక్షణ అలవరుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ ప్రాంతాన్ని విద్యార్థులు సందర్శించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీసీ యూనిట్లు తక్కువగా ఉండేవి. వీటి నిర్వహణకు అయ్యే భారాన్ని భరించలేక విద్యాశాఖ వీటిని ఏర్పాటు చేసేందుకు రాలేదు. కానీ ప్రస్తుత విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ వీటి ఏర్పాటుపై దృష్టిసారించారు. పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 380 ఎన్సీసీ యూనిట్లు ఉండగా, వీటిలో సర్కారు విద్యాసంస్థల్లో 241యూనిట్లు ఉన్నాయి. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు కూడా ఇటీవల భారీగానే పెరిగాయి. గతంలో సర్కారు బడుల్లో 125యూనిట్లు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 900యూనిట్లకు పెరిగింది. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 170, కరీంనగర్లో 152యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రయివేటు విద్యాసంస్థల్లో మరో 849 యూనిట్లు ఉన్నాయి. వీటికితోడు ఈ విద్యాసంవత్సరం కొత్తగా 84 పాఠశాలల్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్(ఎస్పీసీ) యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా విద్యార్థుల్లో సైన్యం వైపు అడుగులు వేసే ఆలోచన శక్తిని పెంపొందిస్తున్నాయి.
కంటోన్మెంట్ సందర్శన
హైదరాబాద్ నగరంలో ఆర్మీ ప్రాంతమైన కంటోన్మెంట్ సందర్శన కార్యక్రమాన్ని విద్యాశాఖ తాజాగా చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన సుమారు 300బడుల్లోని 8,9 తరగతుల విద్యార్థులను దీనిలో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే పది మోడల్ స్కూళ్లు, పది కేజీబీవీలకు చెందిన విద్యార్థులు కంటోన్మెంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీ చేసే విధులు, గతంలో జరిగిన యుద్దాలు, తుపాకులు, మిషన్గన్స్ తదితర వాటి గురించి అక్కడి ఆర్మీ అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు. మార్చి 13నాటికి 300 స్కూళ్ల సందర్శన లక్ష్యం పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్సీఈఆర్టీ అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. తెలంగాణకు చెందిన వారు సైన్యంలో ఎక్కువ మంది ఉండేలా పాఠశాల స్థాయి నుంచే కసరత్తు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమాలు భవిష్యత్లో మంచి ఫలితాలు ఇస్తాయనే నమ్మకం ఉందని చెప్పారు.