Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని స్థాయిల్లో సంప్రదింపులు జరిపాం
- లక్ష మందికి మేసేజ్ పోయింది
- పాదయాత్రలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
- దళితులకు భూమి ఇవ్వకపోతే...
- ఎకరాకు రూ 15 లక్షలు బడ్జెట్లో కేటాయించాలి : ఇష్టాగోష్టిలో ఉత్తమ్కుమార్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ చేపట్టనున్న ప్రజా చైతన్య బస్సు యాత్రపై పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు. బస్సుయాత్రకు సంబంధించి ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బస్సుయాత్ర చేపట్టడం సరైంది కాదని పార్టీ సీనియర్ నేతలు సూచించినా యాత్ర షెడ్యుల్ ప్రకటించడాన్ని తప్పుపడుతున్న నేపథ్యంలో ఉత్తమ్ వివరణ ఇచ్చారు. బస్సుయాత్ర రహస్యమేమీ కాదని, అన్ని స్థాయిల్లో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ప్రకటన చేసినట్టు తెలిపారు. ఇదే అంశంపై లక్ష మందికి మెసెజ్ ఇచ్చామని వివరించారు. పాదయాత్ర చేస్తామని కొంత మంది నాయకులు తనను సంప్రదించారని, అయితే దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. దీని పట్ల ఏఐసీసీ సానుకూలంగా ఉందన్నారు. పాదయాత్రలు చేస్తామని ఎవరడిగారని ప్రశ్నించగా సమాధానం దాట వేశారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిందని, నాలుగేండ్లైనా అమలు చేయలేదన్నారు. భూమి దొరక్కపోతే ఎకరాకు రూ 15 లక్షలు ఈ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పేవన్ని బూటకపు మాటలని విమర్శించారు. విభజన హామీలను అమలు చేయించడంలో విఫలమయ్యారన్నారు. బస్సుయాత్రలో సర్కారు వైఫల్యాలను ఎండగడుతామని చెప్పారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం ఆమోదం పొందిందన్నారు. ఆ చట్టంలో ఉన్న అంశాలను సాధించడంలో కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఏమీ అడగరు...జైట్లీతో మాత్రం పొగిడించుకుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కిటుకు ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయొద్దు
జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం ఆయన దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారని చెప్పారు. దీనిపై డీసీసీ అధ్యక్షులుతో రాహుల్గాంధీ నేరుగా మాట్లాడుతున్నారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే డీసీసీలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోబోదని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆ పార్టీతో పొత్తు ఉండదన్నారు. మార్చి 16,17, 18 తేదీలల్లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు నుంచి ఏఐసీసీ సభ్యులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
డిసెంబర్ మాసంలో ఎన్నికలు రావచ్చు
దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు డిసెంబర్ మాసంలోనే రావచ్చని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతుందని ఉత్తమ్ చెప్పారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. అన్ని స్థాయిల్లో యువతకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలని రాహుల్ నిర్ణయించినట్టు తెలిపారు.