Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యానికి డబ్బులడిగితే దళిత
- కార్మికున్ని చావబాదిన వైనం
- అడ్డొచ్చిన తల్లిని వివస్త్రను చేసి పైశాచికానందం
- ప్రశ్నించిన మరో ఎనిమిది మంది కార్మికులపై దాడి
- 16 గంటల పనికి రూ.16.50...ఆపై చిత్ర హింసలు
- కరీంనగర్లో ఇటుక బట్టీ యజమాని దౌర్జన్యం
నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి
''మిజాజ్ సహి నహీహై. కామ్ నహీ కర్ సక్తా. పైసే దియేంగేతో దవా లాలుంగా...'' అంటూ దళిత కార్మికుడు దీనంగా డబ్బులు అడిగితే...''పైసల్ గావల్నారా? మూసుకుని పన్జేయిరా లం...కొడకా....'' అంటూ ఇటుక బట్టీ యజమాని దుర్భాషలాడాడు. తన అనుచరులతో కొట్టించాడు. అడ్డొచ్చిన కార్మికుని తల్లిని వివస్త్రను చేసి పైశాచికానందం పొందాడు. ప్రశ్నించిన ఎనిమిది మంది కార్మికులనూ చితకబాదించాడు. కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులోని చింతకుంట వీబీఐ ఇటుకల బట్టీలో నెలన్నర కింద జరిగిన ఈ ఘటన దళిత సంఘాల దృష్టికి వెళ్లింది. దళిత సంఘాల ఫిర్యాదుతో బట్టీలో అధికారులు తనిఖీ చేయబోతున్నారన్న సమాచారం తెలుసుకుని యజమాని బాధితులను వేరే బట్టీకి తరలించాడు. అక్కడా కార్మికులు చిత్రహింసలకు గురయ్యారు. కొందరి సహాయంతో బాధితులు మంగళవారం కొత్తపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన 14 మంది కార్మికులను (మూడు కుటుంబాలు)కరీంనగర్ శివారులోని వీబీఐ ఇటుకల బట్టీ యజమాని చింతకుంట నారాయణరావు పనికి కుదుర్చుకున్నాడు. ఆ 14 మందికి అన్నం పెట్టి పది నెలలకుగానూ అందరికీ కలిపి రూ.70 ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్కో కార్మికునికి చూసినట్టయితే పది నెలలకు లభించేది కేవలం ఐదు వేల రూపాయలే. ప్రతి రోజుకు లెక్కగడితే సగటున దక్కే కూలి రూ.16.50యే. ప్రతి రోజూ యజమాని 12 గంటల నుంచి 16 గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తున్నాడు. నొప్పొచ్చినా..జ్వరమొచ్చినా సచ్చినట్టు పనిచేయాల్సిందే. గత నెల రెండో వారంలో రమేష్ మహామందా అనారోగ్యంతో పనికెళ్లలేదు. ఎందుకు వెళ్లలేదని బట్టీ యజమాని, అతని అనుచరులు కార్మికున్ని ప్రశ్నించారు. ''మిజాజ్ సహి నహీహై. కామ్ నహీ కర్ సక్తా. పైసే దియేంగేతో దవా లాలుంగా...'' అని జ్వరంతో బాధపడుతూ చెప్పాడు. అతని పరిస్థితిని చూసి డబ్బులివ్వాల్సింది పోయి...''పైసల్ గావాల్నారా....'' అంటూ కర్ర అందుకుని చావబాదారు. అడ్డొచ్చిన తల్లిని వివస్త్రను చేసి కాళ్లతో తన్నారు. అక్కడే ఉన్న బాధితుని బావమరిది హిమామ్స్చుర్రా సహా మరో ఎనిమిది మంది కార్మికులు వారి దాష్టికాన్ని అడ్డుకోగా...వారందరినీ దూషిస్తూ చావబాదారు. దీంతో ఆ కార్మికులంతా లేవలేని స్థితికి చేరారు. విషయం తెలుసుకున్న ఇన్సాఫ్ దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు జనవరి 31న కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2న అధికారులు తనిఖీ చేసేందుకు వెళ్లగా... ముందే విషయం తెలుసుకున్న బట్టీ యజమాని తన అనుచరుల సహాయంతో బాధిత కార్మికులను గోదావరిఖని గంగానగర్లోని జీఎల్కే ఇటుకబట్టీకి తరలించాడు. కార్మికులంతా స్వగ్రామానికి వెళ్లారని అధికారులకు చెప్పి యజమాని తప్పించుకున్నాడు. గంగానగర్లోనూ ఇటుక బట్టీ యజమాని సతీష్కుమార్ సహా అతని అనుచరులు ఆ కార్మికులను చిత్రహింసలకు గురిచేశారు. దీంతో మరోమారు బాధిత కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి కార్మికులను విడిపించారు. అక్కడ్నుంచి నేరుగా కరీంనగర్ చేరుకున్న బాధితులు మంగళవారం కొత్తపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బందీలుగా ఐదు వేల మంది వలస కార్మికులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 260 ఇటుక బట్టీల్లో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఐదు వేల మంది కార్మికులు చిత్రహింసల నడుమ పనిచేస్తున్నారు. అక్కడ పనిలేక పొట్టచేతపట్టుకుని వచ్చి ఇక్కడ బట్టీల యజమానుల చేతుల్లో బందీలుగా మారుతున్నారు. పనిలోకి తీసుకొచ్చే సమయంలో జంటకు నెలకు రూ.15వేల నుంచి రూ.25వేలు ఇస్తామని బ్రోకర్లు నమ్మించి తీసుకొస్తున్నారు. కార్మికులను తీసుకొచ్చినం దుకుగానూ బ్రోకర్లు రూ.50 వేల వరకు బట్టీల యజమా నుల నుంచి తీసుకుంటున్నారు. వెయ్యి ఇటుకల తయారీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రూ.264 చెలించాలి. కానీ, చాలాబట్టీల్లో అందులో సగం లేదా అంత కంటే తక్కువ ఇస్తున్నారు. కుటుంబాల లెక్కన గుత్తగా మాట్లాడు కుని పనిలో కుదుర్చుతున్నారు. అనేక బట్టీల్లో రెండు, మూడు కుటుంబాలకు పది నెలలకు రూ.70వేల నుంచి రూ.90వేల ప్యాకేజీతో పనిలో పెట్టుకుంటున్నారు. వీటికి తోడు 16గంటలు పని చేయాల్సి వస్తోంది. అయినా వేతనాలు సరిగా ఇవ్వరు. నిలదీస్తే అంతే సంగతులు. కాళ్లతో తన్నడం... కర్రలతో చితకబాదడం లాంటివి చేస్తు న్నారు. వేధింపులు తట్టుకోలేక పారిపోయిన వారిని పట్టుకొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇటుక బట్టీలు జనావాసాలకు దూరంగా ఉండడంతో బట్టీల్లో జరుగు తున్న ఆగడాలు వెలుగులోకి రావట్లేదు.
చట్టాలు అమలు చేయాలి :
మార్వాడి సుదర్శన్, ఇన్సాఫ్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వలస కార్మికులకు గుర్తింపుకార్డులివ్వాలి. చట్టం అమలు చేయాలి. 8గంటల పని విధానాన్ని అమలు చేయాలి. పిల్లలకు పాఠశాల నడపాలి. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అధికారుల నిఘాలేకే కార్మికుల మానప్రాణాలకు రక్షణ కరువైంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిత్యకృత్యం..
- పెద్దపల్లి జిల్లా బేగంపేటలోని ఎమ్బీఎన్, ఎంఎంఎస్ బట్టీలో పని చేస్తున్న వివాహిత మీనాదీప్(24) ఏడాది కింద అదృశ్యమైంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు ఆమె ఆచూకీ లేదు.
- 2016 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లా రాఘవపూర్లో ఏబీసీ ఇసుక బట్టీల ఆవరణలో బాలిక(15)పై యజమాని లైంగికదాడి చేశాడు.
- రెండేండ్ల కింద పెద్దపల్లి జిల్లాలోనే తన పిల్లాడికి పాలు ఇస్తున్న ఓ మహిళను కడుపుపై తన్నడంతో ఆమె చనిపోయిందని... యజమానిని ఎదిరించినందుకుగాను ఇద్దరు యువకులు కెనాల్లో శవాలుగా తేలారన్న ఘటన సంచలనం రేపింది. వారు అడవిపంది వేటకు వెళ్లి చనిపోయారన్నట్టుగా కేసు మూయించారన్న ఆరోపణలున్నాయి.
- గతంలో హత్యకు గురైన ఇటుక బట్టీల కార్మికుతే లబోపాత్ర, కమల్కాంత్ గెహారి, సుఖాంత్ మాంజీ, సూర్జోబాగ్, అన్లగౌడ్ కేసులు ఇంకా నానుతూనే ఉన్నాయి.
పెద్దపల్లి శివారులోని మరో ఇటుకబట్టీలో ఏడాదిన్నర కింద అనారోగ్యంతో గర్భిణిని పనికి రాలేదని యజమాని, అతని అనుచరులు కాళ్లతో కడుపులో తన్నారు. ఆ దెబ్బలతో ఆమె గర్భం పోయింది.
ఆదుకుని ఇంటికి పంపండి..: బాధిత కార్మికులు
పూట గడవటమే కష్టంగా ఉంది. గణేష్ సర్దార్ వచ్చి పది నెలలు పని చేస్తే 14 మంది (మూడు కుటుంబాలు) కలిపి రూ. 70వేలు ఇస్తామన్నాడు. నారాయణరావు దగ్గర పనికి కుది ర్చాడు. ఐదునెలలుగా పని చేస్తున్నాం. నారాయణరావు మనుషులు ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. రోగం వచ్చినా పని చేయాలని నోటికొచ్చినట్టు తిట్టారు. దెబ్బలతో లేవలేని పరిస్థితిలో గోదావరిఖనికి పంపారు. మమ్మల్ని ఆదుకుని ఇంటికి పంపండి.
కఠిన చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం)
కరీంనగర్ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి
ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారు. తరువాత మరిచిపోతున్నారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.