Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ బీఎల్ఎఫ్ పోటీ
- జనాభా ప్రాతిపదికన సీట్లు ఇస్తాం
- కేరళ పాలనే మాకు ఆదర్శం :
- బహిరంగ సభలో బీఎల్ఎఫ్ నేతలు
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రతినిధి
''బీఎల్ఎఫ్ అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటాం. పాలనలో మాకు కేరళ రాష్ట్రమే ఆదర్శం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తాం. గెలిచి తీరుతాం'' అని ఫ్రంట్ రాష్ట్ర నేతలు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఎల్ఎఫ్ బహిరంగసభ సంగారెడ్డి
జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. అంతకుముందు రామచంద్రపురం, బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకు రెండు వేల మందితో వాహన ర్యాలీ చేశారు. ఫ్రంట్ బలోపేతానికి 26 సంఘాలు కలిసి లక్ష రూపాయల విరాళం అందించాయి.
ఈ సందర్భంగా సభలో బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. జనాభాలో నాలుగు శాతం కూడా లేని ఒక సామాజికవర్గమే రాష్ట్రాన్ని పాలిస్తోందని వివరించారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రయివేటు సంస్థలకు అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్తోంది తప్ప ప్రభుత్వ వ్యవస్థను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు.
ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పోటీ చేస్తుందని తెలిపారు. కూటమిలోని పార్టీల గురించి కొందరు సందేహిస్తున్నారని, తమ బలం.. తమ నినాదం 'సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి'లోనే ఉందని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని విమర్శించారు. కేరళ రాష్ట్ర పాలన స్ఫూర్తితోనే బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే పరిపాలిస్తదని చెప్పారు. చిల్లికుండలు ఎన్నింట్లో నీళ్లు పోసినా ఉండవని, శాశ్వత పరిష్కారం చూపించాలని సూచించారు. రైతులకు పంటకు రూ.4వేల అందించడం వల్ల సమస్య తీరదని, చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మార్కెట్లో కూర్చుని రైతులకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం గురించే మాట్లాడే పార్టీలు దమ్ముంటే తమతో సమానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బహిరంగ సభలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు మజీబుల్లాఖాన్, శ్రీనివాస్, తాండ్ర కుమార్, మాస్టార్జీ, చుక్క రాములు, నాగయ్య, మల్లికార్జున్, ఏ.మల్లేశం, మాణిక్యం, రాజయ్య పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక బీఎల్ఎఫ్...
రాష్ట్రంలో బహుజనుల ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక బీఎల్ఎఫ్ మాత్రమేనని ఫ్రంట్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్ తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బహిరంగ సభకు ముందు వారు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఇన్నేండ్లుగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు పాలించినా పేదల బతుకుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక అణచివేత, పదవుల పంపకం పెరుగుతున్నాయన్నారు. ఏండ్లుగా దోపిడీకి, అణచివేతకు గురవుతున్న వారికి రాజ్యాధికారం సాధించడమే బీఎల్ఎఫ్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పాత జిల్లాల ప్రాతిపదికగా పది జిల్లాల్లో బీఎల్ఎఫ్ బహిరంగ సభలు నిర్వహిస్తామని, అందులో భాగంగానే సంగారెడ్డి సభ అని తెలిపారు.