Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభమా..? నష్టమా...?
- నష్టమేనంటున్న ఉన్నతస్థాయి వర్గాలు
- క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలన్న ఆలోచనలో సర్కార్
- పెట్టుబడి పథకంపైనా ఆరా..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా పర్కొన్న రైతు రుణమాఫీ పథకం వల్ల అన్నదాతకు నిజంగా లాభం జరిగిందా? లేక నష్టమా...? అంటే కచ్చితంగా నష్టమే అంటున్నాయి ఉన్నతస్థాయి వర్గాలు. రైతులకున్న రుణాలను ఒకేసారి కాకుండా నాలుగేండ్ల సమయంలో నాలుగు విడతలుగా విడుదల చేయటం వల్ల వారికి న్యాయం జరక్కపోగా.. ప్రభుత్వానికి అది ప్రతికూలాంశంగా మారిందని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశంపై ఇప్పుడు సర్కారు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. ఇందుకోసం అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు వినికిడి. వచ్చే నెల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతుండటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రైతులకు పెట్టుబడి పథకం గురించి పదేపదే ప్రకటనలు విడుదల చేస్తున్న క్రమంలో.. రుణమాఫీ అంశం చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి రూ.4,500 కోట్ల చొప్పున నాలుగు విడతల్లో రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒకేసారి వాటిని విడుదల చేయకపోవటం వల్ల రైతులకు ఉపయోగం జరక్కపోగా.. నష్టం వాటిల్లిందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. మాఫీ సొమ్మును ఏకకాలంలో విడుదల చేయకపోవటంతో రైతుల రుణాలు ఒకేసారి రద్దు కాలేదు. దీంతో ప్రభుత్వం.. రైతుల ఖాతాలో వేసిన సొమ్మును బ్యాంకులు తమ అప్పు కింద బిగపట్టుకున్నాయి. ఇదే సమయంలో మొత్తం అప్పు తీరకపోవటంతో రైతులకు తిరిగి కొత్త లోన్లను ఇవ్వలేదు. ఫలితంగా వారు మళ్లీ అప్పుల కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఇందుకోసం అధిక వడ్డీని చెల్లించేందుకు కూడా వారు సిద్ధపడ్డారు. పాత అప్పులు, కొత్తగా తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ భారాలు.. వెరసి రైతుల ఉసురు తీశాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా విపక్షాలు ప్రస్తావించాయి. ఏకమొత్తంలో రుణాలను మాఫీ చేయాలంటూ కోరినా సర్కారు పట్టించుకోలేదు. అప్పుడు ఈ అంశాన్ని కొట్టిపారేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు దీనిపై సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటూ అధికారులను పురమాయించినట్టు సమాచారం. దీంతోపాటు రైతుకు మద్దతు కోసం పెట్టుబడి పథకాన్ని ఏప్రిల్ 20 నుంచి అమలు చేస్తామంటూ సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. ఇదే వ్యవసాయానికి సంబంధించిన రుణమాఫీపైనా అధికారవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. 'చేసే మాఫీ ఎలాగోలా చేశాం కదా..? దాన్ని ఒకేసారి చేసేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరొచ్చేది..' అని ఒక అధికారి వ్యాఖ్యానించటం గమనార్హం. 'ఒకేసారి మాఫీ చేయకపోవటం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన సరైందే...' అని మరో కీలక అధికారి అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఎకరానికి రూ.4 వేల ఆర్థికసాయంపైనా ఇప్పుడు చర్చ కొనసాగుతున్నది. గతేడాది వరకూ రుణమాఫీ కోసం సంవత్సరానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంతో ఆ పథకం పూర్తయింది. ఇప్పుడు అదే సొమ్ముకు మరికొంత అదనంగా చేర్చి పెట్టుబడి పథకాన్ని అమల్జేయబోతున్నారంటూ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిబంధనలు విధించండి..
సర్కార్కు సుబ్రమణ్యన్ సూచన
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ పెట్టుబడి పథకంపై సర్కారుకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. 'ఈ పథకం మంచిదే. దీన్ని నేషనల్ ఈవెంట్గా నిర్వహించాలని కోరుతున్నా. అయితే పెట్టుబడి పథకం కింద ఇచ్చే డబ్బుల్ని రైతులు సద్వినియోగం చేసుకుంటారా? లేదా? అనే విషయాన్ని కచ్చితంగా పరిశీలించాలి. పంటకు పెట్టుబడి కోసమే వాటిని వినియోగించాలనే నిబంధనను విధించాలి. లేదంటే వేరే అవసరాల కోసం వాటిని వినియోగించే అవకాశముంటుంది...' అని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సలహానిచ్చినట్టు తెలిసింది. మరోవైపు కేసీఆర్తో భేటీ కావటం వల్ల టీఆర్ఎస్ సర్కారు నిర్వహిస్తున్న అనేక పథకాలు, కార్యక్రమాలపై స్పష్టత వచ్చిందని సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. 'ముఖ్యంగా ఎకరానికి రూ.4 వేలు, కేసీఆర్ కిట్, సాగునీటి పథకాలు బాగున్నాయి. వీటి గురించి తెలుసుకునేందుకు వీలుగా రెండున్నర గంటల సమయమిచ్చినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు...' అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.