Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే భిన్నంగా నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడుస్తోందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 25 నిముషాల ప్రసంగంలో రాష్ట్రంలోని వివిధ రంగాల అభివృద్ధిని ప్రస్తావిం చారు. 'బంగారు తెలంగాణ' లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వ విధానాలు రూపకల్పన జరుగుతున్నాయని వివరించారు. సమాజంలో ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడి, అణచివేతకు గురైన వర్గాలు వృద్ధి ఫలాల్ని ఖచ్చితంగా పొందాలని అన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రం అనుభవిస్తున్న క్లిష్టతర అభివృద్ధిలోటును పూడ్చడమే కాకుండా, ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నదని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో గణనీ యమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుండటం సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. రాష్ట్రం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసల్ని పొందాయని కొనియాడారు. రైతుల పొలాలకు కృష్ణా, గోదావరి నదీజలాలను తీసుకురావడం కోసం అనేక భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నామని చెప్తూ... కాళేశ్వరం, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి అంశాలను ప్రస్తావించారు.
వెనుకబడిన రంగాల సర్వతోముఖాభివృద్ధికి నిధులను కేటాయించేందుకై షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేకాభివృద్ధి నిధి చట్టాన్ని చేయడంతో పాటు అనేక ఇతర కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు.2014-15 నుంచి 2016-17 వరకు మూడేండ్లలో తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ 8.6 శాతం సగటు వార్షిక పెరుగు దలకు చేరిందన్నారు. జాతీయ సగటు 7.5 శాతం కంటే అత్యధికమని చెప్పారు. దేశ తలసరి ఆదాయం 2016-17లో రూ.1.03 లక్షలు కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.54 లక్షలుగా అంచనావేసినట్టు తెలిపారు. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, 2016-17లో 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు.
రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లు, ఎత్తిపోతల పథకాలకు నిరంతరాయ విద్యుత్ను ఉచితంగా సరఫరా చేస్తూ కొత్త రికార్డు సృష్టించామన్నారు. 84 లక్షల గొర్రెల లక్షిత పంపిణీకి గానూ 75 శాతం సబ్సిడీతో గొల్ల, కురుమ కులాలకు 50.10 లక్షల్ని పంపిణీ చేశామని తెలిపారు. వంద రోజుల్లో భూరికార్డుల ప్రక్షాళన చేశామని, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు త్వరలో జారీ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. త్వరలో ప్రారంభించే 'ధరణి' వెబ్సైట్లో రాష్ట్రానికి సంబంధించిన భూ రికార్డుల పూర్తి సమాచారం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్ని చేపట్టిందని, ఇప్పటి వరకు 16.64 లక్షల ఎకరాల కొత్త సాగునీటి సామర్ధ్యాన్ని కల్పించి, 8.97 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్టు తెలిపారు.కోటి ఎకరాల సాగునీటి సామర్ధ్యాన్ని సమకూర్చడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు. విద్యుత్రంగం గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని సాధించిందని వివరించారు. టీఎస్-ఐపాస్ వల్ల 4.47 లక్షల మంది వ్యక్తుల నేరు ఉపాధి సామర్ధ్యంతో 6,206 పారిశ్రామిక యూనిట్ల ఆమోదంతో 1.18 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సమకూరాయని చెప్పారు. వాటిలో 3,703 యూనిట్లు కార్యకలాపాల్ని ప్రారంభించాయన్నారు. వరంగల్ వద్ద జౌళిపార్కును ఏర్పాటు చేస్తున్నామని, యూనిట్ల ఏర్పాటు కోసం 22 మంది పెట్టుబడిదారులు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని తెలిపారు. 2016-17లో సాఫ్ట్వేర్, ఐటీ ఉత్పత్తి ఎగుమతుల మొత్తం విలువ రూ.85,470 కోట్లుగా ఉందని చెప్పారు. ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. మెట్రోరైల్ను ప్రారంభించామని, దీనికి ప్రజాస్పందన ప్రోత్సాహకంగా ఉందన్నారు. హరితహారం కింద 30 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ వర్తింప చేసినట్టు తెలిపారు. కేసీఆర్ కిట్లు వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రసవ పూర్వ చెకప్లు, ప్రసవాలు, టీకాల కోసం గర్భిణుల రవాణా నిమిత్తం 250 వాహనాలతో 102-సర్వీసుల పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.సంక్షేమం, విద్య, ఆసరా ఫించన్లు, ప్రజల రక్షణ, భద్రత, పర్యాటక అభివృధ్ధి వంటి పలు అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఆధ్యాత్మిక ఉన్నతి పొందండి
ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిగా, ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. అలాగే ప్రజలంతా ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలని, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
గవర్నర్కు 'కాగ్' నివేదిక సమర్పణ
రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను సోమవారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు సమర్పించారు. 2017 మార్చితో ముగిసిన ఆర్దిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక స్థితి, పద్దులు, బడ్జెట్ ప్రక్రియలకు సంబంధించి ఆడిట్ వ్యాఖ్యలు, పరిశీలనలు ఈ నివేదికలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని 151వ అధికరణాన్ని అనుసరించి 'కాగ్' రాష్ట్ర ప్రభుత్వ పద్దులపై తన ఆడిట్ నివేదికలను గవర్నర్కు సమర్పించింది. ఈ నివేదికలను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుగు, ఇంగ్లీష్ భాషలతో కూడిన ప్రతులను అందచేసినట్టు పీఐబీ అధికారులు తెలిపారు.