Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పక్కకు.. తొలిరోజు సభ తీరు..
- పై చేయి కోసం అధికార, ప్రతిపక్షాల పాకులాట
- ఇక జనం సమస్యలు గాలికేనా..?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
షరా మామూలే.. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఆనవాయితీగా సభలో తమ ఆధిపత్యం, పై చేయి కోసం పాకులాడాయి. దీంతో ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావాల్సిన శాసనసభ రణరంగంగా మారింది. ఫలితంగా జనానికి సంబంధించిన అంశాలు పక్కకుపోయి.. నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లూ ముందుకొచ్చాయి. పేపర్లు చిరిగాయి, మైకులు విరిగాయి. ఇదే సమయంలో గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు మించి శాసన మండలి చైర్మెన్ స్వామిగౌడ్ కన్నుకు గాయమైందనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. సభలో కొనసాగిన ఈ రాద్ధాం తంలో తప్పు మీదంటే మీదేనంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పర ఆరోపణాస్త్రాలు సంధించుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు మద్యం తాగి సభకు వచ్చారంటూ మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి ఎద్దేవా చేయగా.. స్వామిగౌడ్ కంటికి గాయమైందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తా నంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ టిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసి రారు. ఈ నేపథ్యంలో మార్చి 27 వరకు అసెంబ్లీ సమా వేశాలు సజావుగా జరుగుతా యా? జరిగినా బడ్జెట్ లోని అంశాలు.. ప్రజా సమస్యలు ప్రస్తావన కొస్తాయా..? అనే సందేహాలు ఇప్పుడు వెల్లువెత్తు తున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజైన సోమవారం శాసన సభ ప్రారంభమే.. ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ మాట్లాడేందుకు ప్రయత్నించగానే.. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి పోడియం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ హోరెత్తింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన కాంగ్రెస్ సభ్యులు తమ చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను చించి సభలో విసిరేశారు. గవర్నర్ ప్రసంగం ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేదలకు అత్యంత అవసరమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ తదితర విషయాలకు గవర్నర్ ప్రసంగంలో చోటు దక్కలేదంటూ నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్త వాతావరణం నడుమే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే అంతకు ముందు కోమటిరెడ్డి విసిరిన హెడ్ఫోన్ తగలటంతో స్వామిగౌడ్ కంటికి గాయమైందంటూ టీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన్ను వీల్ఛైర్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ సభ్యుల తీరు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్రావు విమర్శించగా.. గవర్నర్ ప్రసంగం తాము ఆశించిన విధంగా లేకపోవటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యామని ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు సభలోపల మార్షల్స్, బయట పోలీసులు చేసిన బలప్రయోగం వల్ల తమ కాళ్లు, చేతులకు సైతం దెబ్బలు తగిలాయంటూ కాంగ్రెస్ సభ్యులు మీడియా ముందు వాపోయారు. మొత్తం మీద అటు అధికారపక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం సభలో వ్యవహరించిన తీరునుబట్టి.. బడ్జెట్లోని 'అసలు' విషయాలు.. ప్రజా సమస్యలపై చర్చ కొండెక్కినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.