Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని ప్రయివేటు దవాఖానల తీరు
- నాసిరకం సేవలతో రోగులకు రిక్తహస్తం
- సర్కారు నుంచి సొమ్ము వసూలు చేస్తూ అరకొర వసతులు
- పేద రోగులకు అందని ద్రాక్షగా పథకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్కు కిడ్నీలో రాళ్లు రావడంతో సరూర్నగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లాడు. చాలా నొప్పిగా ఉందని బాధితుడు చెప్పడంతో అత్యవసర చికిత్స చేయాలని, అందుకు అడ్వాన్సుగా రూ.10 వేలు చెల్లించాలని అక్కడి డాక్టర్లు చెప్పారు. అయితే. తనకు ఆరోగ్య శ్రీ కార్డు ఉందని ఉచితంగా చికిత్స చేయాల్సిందిగా కోరాడు. కార్డు ఉన్నా ఆరోగ్య శ్రీ ట్రస్టు నుండి అప్రూవల్ రావాలంటే ఒకరోజు సమయం పడుతుందని.. అందువల్ల అడ్వాన్సు చెల్లిస్తే అప్రూవల్ వచ్చాక తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. అత్యవసరం కావడంతో చేసేదిలేక బాధితుడు చెప్పిన మొత్తం చెల్లించాడు. కానీ, డిశ్చార్జీ అయినా ఆ డబ్బులు ఆస్పత్రి యాజమాన్యం తిరిగి ఇవ్వలేదు.
వ్యాధీ నయమవలేదు.'
'ఖమ్మం జిల్లాకు చెందిన మంగీలాల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి లుకేమియా (బ్లడ్క్యాన్సర్)తో బాధపడుతున్నాడు. తనకు ఆరోగ్య శ్రీ కార్డు ఉందన్న భరోసాతో కొన్నాళ్ల క్రితం నగరంలో రెండు ప్రయివేటు ఆస్పత్రులను సంప్రదిం చాడు. కార్డు ఉన్నా..చికిత్స చేయాలంటే రూ.30 నుంచి 40 లక్షలు ఖర్చవుతాయని అక్కడి డాక్టర్లు చెప్పడంతో నివ్వెరపోయాడు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో బాధితుడు ఎంఎన్జేలో చికిత్సపొంది బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.'
ఇలాంటి దుస్థితి వీరిద్దరిదే కాదు. రాష్ట్రంలో ఎంతో మంది పేద రోగులకు ఎదురవుతున్న సమస్య. ఆరోగ్య శ్రీ కార్డు ఉందన్న కొండంత భరోసాతో వైద్యం కోసం పేద రోగులు మల్టీస్పెషాలిటీ, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే జేబులు గుల్లవుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి చికిత్సకు అనుమతి రావడం ఆలస్యమైతే పేదల నుంచి ముందస్తుగానే ఆడ్వాన్సుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమకు గిట్టుబాటయ్యే వ్యాధులకు మాత్రమే చికిత్స చేస్తూ ఖరీదైన రోగాలపై చేతులెత్తేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద వచ్చిన డబ్బుతోపాటు అదనపు ఫీజులు గుంజుతున్నాయి. దీంతో కార్డు ఉన్నా..అడ్వాన్సు పేరుతో నిరుపేద రోగులు ఉన్న ఆస్తులు ఆమ్ముకుని అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి ఆస్పత్రులపై నిఘా లేకపోవడం, పథకం అమలుపై సరైన పర్యవేక్షణ లేకపోవడమనే కారణమని రోగులు విమర్శిస్తున్నారు. గిట్టుబాటయ్యే రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తూ.. ఇతర వ్యాధులపై విముఖత చూపుతున్నాయి. ముఖ్యంగా లుకేమియా, బోన్మ్యారో, బ్రెయిన్ ట్యూమర్ తదితర క్యాన్సర్ వ్యాధులతోపాటు గుండెమార్పిడి, కాలేయం, కిడ్నీ మార్పిడి అవయవాల మార్పిడి వంటి ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ కింద చేసేందుకు కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు తిరస్కరిస్తున్నాయి. ఈ చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద వచ్చే నిధుల్లో తమకు పెద్దగా ఆదాయం రాదని ఇలాంటి ఆస్పత్రులు బహిరంగంగానే పేర్కొనడం గమనార్హం. మరికొన్ని దవాఖానలు మాత్రం ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా అదనపు ఫీజు చెల్లిస్తేనే చికిత్స చేస్తామని ముందుగానే రోగి కుటుంబసభ్యులతో ఒప్పందం కుదుర్చుకుని చికిత్స చేస్తున్నాయి.
ఆరోగ్యశ్రీ పరిధిలో 938 వ్యాధులకు ప్రభుత్వం చికిత్స అందిస్తున్నది. రాష్ట్రంలో 230 మల్టీస్పెషాలిటీ, 13 కార్పొరేట్ ఆస్పత్రులతో ఆరోగ్య శ్రీ ట్రస్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా వ్యాధులకు చికిత్స చేయించుకుంటే అయ్యే ఖర్చును ప్యాకేజీల ప్రకారం ట్రస్టు చెల్లిస్తుంది. రాష్ట్రంలో ఏటా రూ.700 కోట్ల వరకు వెచ్చిస్తున్నది. అందులో దాదాపు 80 శాతం ప్రయివేటు ఆస్పత్రుల ఖాతాకే వెళుతున్నది. ఆరోగ్యశ్రీ కింద తక్కువ మొత్తానికి చికిత్స చేయాల్సి రావడంతో రోగులను ప్రయివేటు ఆస్పత్రులు పీల్చుకుతుంటున్నాయి. ముఖ్యంగా అత్యవసర, శస్త్రచికిత్సల కోసం వచ్చేవారిని ముప్పుతిప్పలు పెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే రోగాలకూ ముందుగానే డిపాజిట్ల పేరిట వేలకు వేలు గుంజుతున్నాయి. ఈ పథకం కింద వర్తించే శస్త్రచికిత్సలకూ పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీపై అవగాహన ఉన్నవారిని కూడా 'ఇది లేదు.. అది లేదు' అంటూ గందరగోళపరుస్తున్నాయి. చివరికి పథకం అధికారులకు మొరపెట్టుకున్నాక, అక్కడి నుంచి ఆదేశాలు వస్తేగానీ చికిత్స అందించకుండా మొండికేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించేందుకు ప్రయివేటు ఆస్పత్రులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి రాలేదని ట్రస్టు అధికారులు తెలిపారు. ఏ ఆస్పత్రిలోనైనా వైద్యం అందించకున్నా, అదనంగా ఫీజులు వసూలు చేసినా తమకు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వాహకుల నుండి ఏదైన సమస్య వస్తే ఆరోగ్య మిత్ర దృష్టి తీసుకెళ్లాలని తెలిపారు.
రోగులతో దురుసుగా..
ఇక కచ్చితంగా ఆరోగ్య శ్రీ కిందే చికిత్స చేయించు కోవాలనుకునే రోగులతో ప్రయివేటు ఆస్పత్రులు అనుచితంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రోగులతో పాటు వారి బంధువులను సదరు ఆస్పత్రుల నిర్వాహకులు ఛీదరించుకోవడం, సమయానికి డాక్టర్లు చికిత్స అందించకపోవడం, దురుసుగా మాట్లాడడం లాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోయాయని పలువురు 'నవతెలంగాణ'తో వాపోయారు. కోలుకోకముందే డిశ్చార్జీ చేస్తున్నారని.. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి అరకొర వైద్యం, నాసిరకం వసతులతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పథకం ప్రారంభమైన కొత్తలో ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య చికిత్సలు, వసతులన్నీ ఇతర రోగుల్లాగే ఆరోగ్యశ్రీ రోగులకూ అందేవి. దీంతో ఈ పథకం పట్ల ప్రజల్లో ఆదరణ ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఆరోగ్యశ్రీపై పర్యవేక్షణ కొరవడటంతో ప్రయివేటు ఆస్పత్రులు నిర్లక్ష్య భావంతో వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కాగా, ఈ పథకం కింద వైద్యం పొందేందుకు వచ్చే వారిలో చాలా మంది నిరుపేదలే ఉంటుండగా, వారికి పథకంపై అవగాహన అంతంతే ఉంటున్నది. ఈ కారణంగానే ఆస్ప త్రుల్లో రోగులకు ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పించేందుకు, దగ్గరుండి సేవలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఆరోగ్యమిత్రలను ఏర్పాటు చేసింది. రోగులు అడుగిడిన వెంటనే వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నదీ లేనిదీ వీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి, సంబంధిత చికిత్స ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తాయా? రావా?అనేది కొన్నింటిని ప్రాథమికంగా, మరికొన్నింటిని పరీక్షల తర్వాత తెలుసుకోవాలి. కానీ, మిత్రలు ఇలాంటివేవీ పాటించడం లేదన్న ఫిర్యాదులూ ఉన్నాయి. రోగులను ఆస్పత్రి నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నా, చికిత్స విషయంలో పట్టించుకోకపోయినా, దగ్గరుండి సేవలు అందేలా చూడాల్సిన ఆరోగ్య మిత్రలు, నిర్వాహకులకే వంత పాడుతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.
సంవత్సరం కేసులు చెల్లింపులు (రూ..కోట్లలో)
2014-15 1,96,86 520
2015-16 2,60,543 686
2016-17 2,77,199 715
2017-18 1,83,108 460