Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 66 శాతం మంది భారతీయులకు నిద్ర కష్టాలు
- మందులు, ఇతర వ్యాపకాలతో నిద్ర తెచ్చుకుంటున్న 45 శాతం యూత్
- పని ఒత్తిడి, టెక్నాలజీ వినియోగం, నగరీకరణ, ఆధునిక జీవనశైలే ప్రధాన కారణం
- తక్కువ గంటలు నిద్రించే వారిలో 15శాతం మరణరేటు ఎక్కువ! : ఫిలిప్స్ ఇండియా, హార్వర్డ్ యూనివర్సిటీ సర్వేల్లో వెల్లడి
''కడుపు నిండా చక్కని తిండి. కంటి నిండా కమ్మటి నిద్ర.. మనిషికి ఈ రెండూ చాలంటారు పెద్దలు!'' ''చక్కని తిండి సరే.. కమ్మటి నిద్రేంటి? కమ్మగా ఉండటానికి.. అదేమైనా ఆహారమా?'' అనే సందేహం వద్దు. ఆధునిక కాలంలో.. మారుతున్న జీవనశైలి కారణంగా.. నిద్ర యొక్క అసలైన రుచేంటో నేటి జీవి ఎప్పుడో మరిచిపోయాడు. ఇప్పుడు ఆ నిద్రలేమే సకల రోగాలకు మూలంగా పరిణమించడం ఆందోళనను కలుగజేస్తోంది. ఆ నేపథ్యంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
* జై
ఉరుకులూ పరుగుల జీవనం మూలంగా ఒత్తిడి మొదలై, సరైన నిద్రలేక మనిషి జీవితం క్రమక్రమంగా దుర్భరమవుతున్నదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. నిద్రలేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భారతీయులదే ప్రముఖ స్థానమని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే, హెచ్చరించిన విషయం తెలిసిందే! అయినప్పటికీ, భారతీయుల వ్యవహారశైలిలో మార్పు రాకపోవడం విచారకరం.
66 శాతం మందికి నిద్రలేమి!
ఇండియా, అమెరికా, యూకే, చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి 13దేశాలకు చెందిన సుమారు 15వేల మంది యువతీ, యువకులపై 'ఫిలిప్స్ ఇండియా' సంస్థ నిద్రకు సంబంధించి నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. తమలో నిద్రలేమికి టెక్నాలజీయే ప్రధాన కారణమని అధ్యయనంలో పాల్గొన్న సుమారు 32శాతం మంది భారతీయులు అభిప్రాయపడగా, ఓవర్ నైట్ డ్యూటీ వల్ల నిద్రకు దూరం అవుతున్నామని 19శాతం మంది పేర్కొన్నారు. ఆఫీసు సంబంధిత ఒత్తిళ్ళ మూలంగా నిద్ర పట్టడం లేదని 58శాతం మంది తెలిపారు. వివిధ సాధనాల ( మందులు, మ్యూజిక్ వగైరా) ద్వారా నిద్రను బలవంతంగా తెచ్చుకుంటున్నట్టు 45శాతం మంది ఇండియన్స్ చెప్పడం విస్తుగొలుపుతోంది. 'ఆరోగ్యం బాగుండాలంటే, వ్యాయామం చేస్తే సరిపోతుంది. నిద్రతో పనిలేద'ని సర్వేలో పాల్గొన్న సుమారు 66శాతం మంది చెప్పడాన్ని చూసిన సర్వే ప్రతినిధులు.. ''మనిషి జీవితంలో నిద్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ తరానికి అవగాహన లేద''ని వాపోవడం గమనార్హం.
మరణాలకూ కారణం:
మనిషికి మంచి తిండి ఎంత అవసరమో, సుఖమైన నిద్ర కూడా అంతే అవసరం. అత్యాధునిక జీవన విధానంవైపు పరుగులు పెడుతున్న ప్రతి మనిషి ఎంత పని ఉన్నా.. రోజుకు తప్పకుండా ఏడెనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు సెలవిస్తున్నారు. మనిషికి కావలసినంత నిద్రలేకపోవడం వల్లే చిరాకు, అసహనంతో కూడిన ఒత్తిడి, నిరుత్సాహం, ఏకాగ్రత మందగించడం వంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయని, నిద్రలేమి మూలంగా తలనొప్పి మొదలై క్రమంగా జ్ఞాపకశక్తి లోపించే అవకాశం కూడా ఉన్నదని వివిధ పరిశోధనల్లో తేలింది. అంతేనా, నిద్రలేమి మూలంగా నరాలకు సంబంధించిన వ్యాధులు, మైగ్రేన్ వంటి నొప్పులు, అధిక బరువు, గ్యాస్ట్రిక్ వంటి అజీర్తి బాధలు వస్తాయని ఢిల్లీని ఎయిమ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో సైతం వెల్లడైంది. ముఖ్యంగా, భారతదేశంలో 70 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని వీరిలో ఎక్కువ శాతం యువతేనని తేలడం ఆందోళన కలిగిస్తోంది. నిద్రలేమి వల్ల అనారోగ్య సమస్యలతో పాటు మరణరేటు సైతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు రూడీ అయింది. రోజుకు ఏడు గంటలు మించి నిద్రపోయే వారితో పోలిస్తే, ఆరు గంటలకన్నా తక్కువ నిద్రపోయేవారిలో 15శాతం మరణరేటు ఎక్కువగా ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
మానసిక ప్రశాంతతకు, రోగాల నుంచి కాపాడుటకు కమ్మటి నిద్రను మించిన మంచి ఔషధం లేదంటారు. సరైన తిండి, వ్యాయామం ఎంతున్నా.. మనిషికి ప్రశాంతమైన నిద్ర కూడా కావాలని నేటి తరం గుర్తించడం ఇప్పుడు ఎంతైనా అవసరం.
నిద్ర - ఆసక్తికర అంశాలు :
తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని అనుకుంటారు. ఇది పచ్చి అబద్ధం. వేకువజామున ప్రతీ ఒక్కరూ 'రెమ్' నిద్ర ( కలలు గుర్తుండే సమయంలోని నిద్ర ) లో ఉండటం వల్ల వచ్చిన కలలు గుర్తుండి.. మరునాడు యాధృచ్ఛికంగా ఎక్కడో ఓ దగ్గర ఆ కలలు సింక్ అవ్వడం వల్ల.. డ్రీమ్స్ నిజమయ్యాయని అపోహ పడతాం. అంతే!
గ్రామాలతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికే నిద్రలేమి సమస్యలు ఎక్కువట! పట్టణాల్లో నివసించే దాదాపు 93శాతం మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని అంచనా!
నిద్రలేమి వల్ల పిల్లల్లో పెంకితనం పెరుగుతూ, ఎదుగుదల( శారీరకంగా, మానసికంగా) తగ్గే అవకాశమున్నట్టు ఇటీవలి ఓ సర్వేలో తేలింది.