Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్ల విధానం అమలులో సవరణ
- విశ్వవిద్యాలయం బదులు డిపార్ట్మెంట్ యూనిట్గా పరిగణన
- యూజీసీ నిబంధనల్లో తాజా మార్పే కారణం
- రోస్టర్ పాయింట్ల లెక్కించేందుకు మరింత కాలం పట్టే అవకాశం
- 1061 అధ్యాపక పోస్టుల భర్తీకి గండం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో లేనట్టే కనిపిస్తున్నది. వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఏదో ఒక రూపంలో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల్లో మార్పు తేవడమే ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కావడానికి కారణం కానుంది. యూజీసీ రిజర్వేషన్ల విధానంలో సవరణ చేసింది. ఇప్పటి వరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విశ్వవిద్యాలయం యూనిట్గా ఉండేది. కానీ యూజీసీ మార్చిన నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ యూనిట్గా పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 5న యూజీసీ ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. దీంతో తెలంగాణలో విశ్వవిద్యాలయాల్లో ప్రకటించిన 1,061 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యం కానుంది. విశ్వవిద్యాలయాల్లో డిపార్ట్మెంట్ వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్లు లెక్కించాలంటే మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం యూనిట్ కాబట్టి గతంలో చేపట్టిన నియామకాల్లో చివరి రోస్టర్ పాయింట్ ఏ సబ్జెక్టు, ఏ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించారన్న దాన్ని బట్టి కొత్తగా తయారు చేస్తారు. కానీ డిపార్ట్మెంట్ వారీగా రోస్టర్ పాయింట్లు అంటే కొత్తగా రూపొందించాలి. అదీ న్యాయపరంగా కోర్టులు తప్పు పట్టకుండా, యూజీసీ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ తయారు చేయాలి. విశ్వవిద్యాలయాల అధికారుల మెడపై కత్తి వేలాడుతున్నది.
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎప్పుడో నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. కానీ విద్యాశాఖ ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతున్నది. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నెట్, సెట్, జేఆర్ఎఫ్యూజీసీ నిబంధనల సాకుతో రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే పీహెచ్డీ పూర్తి చేసి ఉండడం తప్పనిసరి అన్న నిబంధన యూజీసీ అమలు చేయకుండానే తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. 2020-21లో అమలు చేసే ఈ నిబంధనలను మరోసారి పరిశీలించాలని నోటిఫికేషన్లు వెలువడకుండా నిలుపుదల చేశారు. తాజాగా అధ్యాపక పోస్టుల భర్తీకి రిజర్వేషన్ల విధానంలోనే మార్పు రావడంతో కథ మొదటికి వచ్చింది. విశ్వవిద్యాలయం యూనిట్గా కాకుండా డిపార్ట్మెంట్ యూనిట్గా పరిగణించడం వల్ల రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం కలిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో రోస్టర్ పాయింట్లు నిర్ణయించడానికి ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులు మొదటి ప్రాధాన్యం, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు రెండో ప్రాధాన్యం, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులకు మూడో ప్రాధాన్యం ఉంది. ఆల్ఫబెటికల్ ఆర్డర్ నుంచి సబ్జెక్టుల వారీగా ఖాళీ పోస్టులకు రోస్టర్ పాయింట్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఆర్ట్స్లో తెలుగు సబ్జెక్టులో మూడు పోస్టులే ఉంటే జనరల్, జనరల్ మహిళ, బీసీ కోటాకు మాత్రమే వర్తించే అవకాశముంది. ఆ తర్వాత ఐదులోపు ఖాళీలుంటే ఇదే విధానం వర్తించనుంది. ఇలా తక్కువ పోస్టులు ఖాళీగా ఉండే డిపార్ట్మెంట్లలో రోస్టర్ పాయింట్లు నిర్ణయించి ఆ పోస్టులు ఏ కేటగిరీకి కేటాయించాలన్నది కొంత ఇబ్బందికరంగానే మారనుంది. ఈ నేపథ్యంలో జనరల్ కేటగిరీకి ఎక్కువ పోస్టులు కేటాయించడం, రిజర్వేషన్ కేటగిరీకి తక్కువ పోస్టులు కేటాయించే ప్రమాదం లేకపోలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తలలు పట్టుకుంటున్న అధికారులు
తెలంగాణలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. రిజర్వేషన్ల విధానంలో యూజీసీ నిబంధనల మారడంతో ఏం చేయాలన్న దానిపై ఉన్నత విద్యామండలి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి సారించారు. యూజీసీ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తెలియడంతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వీసీలతో సంప్రదింపులు చేస్తున్నారు. జూన్ నాటికి ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే గవర్నర్ నరసింహన్కు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ హామీని నిలబెట్టుకోవడం ఎలా?అన్నదానిపై సమాలోచన చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయి. ఖాళీ పోస్టులతో వర్సిటీల్లో బోధన కుంటుపడుతున్నది. నాణ్యమైన విద్య అందక విద్యార్థులు నష్టపోతున్నారు. పది నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడం పట్ల నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టులు
విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ప్రొఫెసర్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం
మహాత్మాగాంధీ 10 15 09 34
పాలమూరు 12 10 41 63
శాతవాహన 9 16 15 40
తెలంగాణ 11 25 23 59
ఆర్జీయూకేటీ 25 11 60 96
అంబేద్కర్ - 03 07 10
తెలుగు - 01 06 07
కాకతీయ - 11 125 136
జేఎన్ఏఎఫ్ఏయూ - 05 10 15
జేఎన్టీయూహెచ్ 32 52 102 186
ఉస్మానియా - 121 294 415
మొత్తం 99 270 692 1061