Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో కాదు.. జనంలో ఉండాలె...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'పంచాగకర్త సంతోష్శర్మ చాలా చతురుడు.. ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏ రాశి వారికి టిక్కెట్లకు ఢోకా లేదో.. ఏ రాశి వారికి ఇబ్బంది కలుగుతుందోననే విషయాన్ని ఆయన చెప్పారు. మరి ఆయా రాశుల వారు జాగ్రత్తగా ఉండాలె. టిక్కెట్లు సంపాదించాలంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉండకుండా.. ప్రజల్లో ఉండి మంచిపేరు తెచ్చుకోవాలె. అప్పుడు ఆటోమేటిగ్గా టిక్కెట్లొస్తరు...' అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ యేడాది రాష్ట్రంలోని దుర్మార్గుల ప్రకోపం కూడ తగ్గుతుందంటూ పంచాగకర్త చెప్పడం సంతోషదాయకమని అన్నారు. 'పంచాగకర్త తెలంగాణ రాష్ట్రానిది కర్కాటక రాశి అని చెప్పారు.. ఆ ప్రకారంగా మన ఆదాయం 8, వ్యయం 2.. అందువల్ల తెలంగాణ మిగులు రాష్ట్రమేనని...' విశదీకరించారు. మన రాష్ట్రం తనను తాను అభివృద్ధి చేసుకుంటూ దేశ నిర్మాణంలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ అద్భుతమైన వెలుగుజిలుగులతో విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మన రాష్ట్రం అద్భుతమైన సిరిసంపదలతో తుల తూగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేవ భూమి అని.. అందువల్ల ఇక్కడ అద్భుతంగా పూజలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహిస్తున్నదని చెప్పారు. సకల జనులను అభివృద్ధి చెందించటమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆ దిశగా పయనించి బంగారు తెలంగాణ సాధిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హోం, వైద్య, ఆరోగ్య శాఖల పనితీరు బాగుందంటూ పంచాంగకర్త చెప్పడంతో ఆయా శాఖల మంత్రులకు ఎలాంటి ఢోకా లేదన్న సీఎం.. మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డిని ప్రశంసించారు. డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో పోలీసు jంత్రాంగం బాగా పని చేస్తుందన్నాదని కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అవతరించడం.. తదనంతరం మంచి ఫలితాలు సాధించడంతో మన రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నదని తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్ మధుసుదనాచారి, మండలి చైర్మెన్ స్వామిగౌడ్తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు.. సీఎంకు భద్రాచల రాముడి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.