Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛాతినొప్పి రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలింపు
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
అవినీతికి పాల్పడి కోట్ల రూపాయల ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించిన నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపల్లి గాంధీని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాగా నిందితుడికి హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రికి చంచల్గూడ జైలు అధికారులు తరలించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గాంధీ ఆస్తులపై శనివారం ఏసీబీ అధికారులు దాడులను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో హైదరాబాద్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ. 3.57 కోట్ల రూపాయల ఆస్తులను గాంధీ కలిగి ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. అదే రోజు రాత్రి గాంధీని వారాసీగూడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసింది. అయితే తనకు ఛాతిలో నొప్పి వస్తున్నదంటు గాంధీ చెప్పడంతో ఏసీబీ అధికారులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించారు. తర్వాత డాక్టర్లు నిందితుడిని డిశ్చార్జ్ చేయడంతో అతన్ని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. దీంతో నిందితుడిని పదిహేను రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించడమే గాక అవసరమైతే మరో సారి ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చంచల్గూడ జైలుకు ఏసీబీ అధికారులు గాంధీని తరలించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి తనకు ఛాతిలో నొప్పి వస్తున్నదంటు గాంధీ తెలపడంతో తిరిగి రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు.