Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగును బతికించుకోవాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- స్వర్ణభారత్ ట్రస్టులో ఉగాది వేడుకలు
నవతెలంగాణ- శంషాబాద్
ప్రపంచ దేశాలు భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తున్నాయని, మనవాళ్లు మాత్రం విస్మరిస్తుండటం ఆందోళనకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ రెవెన్యూ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్టులో ఉగాది వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రులు తోమర్, పూరి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నాయని తెలిపారు. మన దేశ ప్రజలు పాశ్చాత్య పోకడలతో మన సంస్కృతి, విలువలను వదిలేయడం ఆందోళనకరమన్నారు. తెలుగు ప్రజల సంవత్సర పండుగ ఉగాది ప్రత్యేకమైందన్నారు. పరభాషా వ్యామోహంలో పడి తెలుగును మరిచిపోవడం సరికాదని, తెలుగును బతికించుకోవడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మాతృభాషలో చదివిన వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి తోమర్ మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలు దేశానికే ఆదర్శమని ప్రశంసించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టులో నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ద్విచక్రవాహన మెకానిక్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రేంరాజ్ తదితరులు పాల్గొన్నారు.