Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నక్సల్స్ ప్రభావిత మంత్రులు, ప్రజాప్రతినిధుల అంగరక్షకులకు ఐఎస్డబ్ల్యూ నుంచి హెచ్చరికలు
- అప్రమత్తంగా లేని గన్మెన్లను తప్పించే యోచనలో ఉన్నతాధికారులు
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మంత్రులు మొదలుకుని ఇతర ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తున్న అంగరక్షకులు తమ విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సెక్యూరిటీ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హెచ్చరించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు చెందిన మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు ఉన్న గన్మెన్లకు ప్రత్యేకంగా సూచనలు అందినట్టు తెలిసింది. ఇటీవలన రాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించడంతో ... ఉత్తర తెలంగాణలో మావోయిస్టులు ఏదేని భారీ సంఘటనలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు ఉన్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుపుతామంటూ మావోయిస్టులు చేసిన హెచ్చరికపైనా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకించి దృష్టిని సారించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిదుల రక్షణ కోసం నియమించబడ్డ గన్మెన్లలో చాలా వరకు అలర్ట్గా ఉండటం లేదని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు చెందిన ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నట్టు తెలిసింది. కొందరు ప్రజాప్రతినిధులతో కొందరు అంగరక్షకులు సొంత మనుషులుగా మెలుగుతూ వారికి కచ్చితంగా నిర్దేశించిన పనులకు బదులు సొంత పనులు చేయడంలో ఆసక్తిని చూపిస్తున్నారని అధికారులకు సమాచారం ఉన్నట్టు తెలిసింది. కేవలం ఆయుధాలను ధరించి 24 గంటలు తమ ప్రొటెక్టీ(రక్షితుడి)కి సెక్యూరిటీని కల్పించాలని, వారికి సంబంధించిన ఇతర పనులేమీ చేయరాదని గన్మెన్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగానే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధుల వద్ద ఉన్న గన్మెన్లు వీటిని అతిక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. మరో వైపు ప్రొటెక్టీలు సైతం వారికి తమ సొంత పనులను అప్పగించడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీల రక్షణ కోసం నియమితులైన గన్మెన్ల పని తీరుపైనా ఉన్నతాధికారులు అంతర్గతంగా ఆరా తీస్తున్నారని తెలిసింది. అలాగే ధీర్ఘకాలం అంగరక్షకులుగా ఉన్న వారెంత మంది అనే వివరాలు కూడా సేకరిస్తున్నారని సమాచారం. అలాంటి వారిని ఈ విధుల నుంచి తప్పించి పీఎస్ఓలుగా శిక్షణ పొందిన వారికి ఈ విధులను అప్పగించాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారని తెలుస్తోంది.
ఇక రక్షణ పొందుతున్న ప్రొటెక్టీలు సైతం గన్మెన్లను తమ సొంత విధులకు వాడుకోరాదని, అలా జరిగితే తమ ప్రాణాలకు శత్రువు నుంచి ముప్పు ఏర్పడుతుందనే నిజాన్ని మరువరాదని కూడా ఉన్నతాధికారులు సూచిస్తున్నారని తెలిసింది. రాష్ట్రంలో దాదాపు ఐదు వందల మందికి పై గా ఏఆర్ కానిస్టేబుళ్లు సెక్యూరిటీ విధుల్లో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.