Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీ అయితేంటీ... రుణం చెల్లించరా ?
- రూ. 20 వేల కింద కుట్టుమిషన్ గుంజుకెళ్లిన మేనేజర్
- ఎక్కువ మాట్లాడితే ఇల్లు జప్తు చేస్తామని హెచ్చరిక
- పరువు పోయిందని మేనేజర్పై లబ్దిదారు కేసు
- నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో ఘటన
''కడుపుకు అన్నం తింటలేరా? గడ్డి తింటున్నారా? బ్యాంకులో నాలుగేండ్ల కిందట అప్పు తీసుకుని చెల్లించరా.. మీరు ఎస్టీ అయితే రుణం చెల్లించొద్దని ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం మీకు సబ్సిడీ రుణం ఇవ్వడమే తప్పు. మీ దగ్గర ఏ వస్తువున్నా తీసుకెళ్తాను. డబ్బు కట్టకపోతే ఇంటినీ జప్తు చేస్తాం..'' అని మహిళపై బ్యాంకు మేనేజరు తమ ప్రతాపం చూపించాడు. లక్షల రూపాయల రుణం తీసుకున్న వారిని వదిలేసి పేద కుటుంబంపై బ్యాంకు వారు దాడి చేయడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి...
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రతినిధి
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఎరుకలి తిరుపతయ్య పందులు కాస్తూ, బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొంత ఆస్తులేమీలేవు. ఈత కర్రలతో బుట్టలు తయారు చేసి ఊర్లు తిరుగుతూ అమ్మి జీవనం సాగిస్తారు. కొన్ని పందులను కూడా పెంచుతూ.. వాటి నుంచి వచ్చే ఆదాయంతో అతికష్టం మీద బతుకెళ్లదీస్తున్నారు. ఆయనకు 2014లో 'మాడా' పథకం కింద కోడేరు మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు నుంచి ప్రభుత్వం రూ.50 వేలు రుణం ఇచ్చింది. ముందుగా లబ్దిదారు వాటా కింద రూ.5వేలు కడితే, రూ.50 వేలు రుణం మంజూరైంది. ఇందులో రూ.25 వేలు సబ్సిడీ. తిరిగి చెల్లించాల్సిన అప్పు రూ.20 వేలు. అయితే, వడ్డీ చెల్లిస్తూ వస్తున్న తిరుపతయ్య అసలు రుణం కట్టలేకపోయాడు.ఇటీవల బ్యాంకు మేనేజరు పిలిపించి అప్పు చెల్లించాలని అడిగాడు. వారం రోజుల తర్వాత (సోమవారం) చెల్లిస్తానని తిరుపతయ్య బతిమిలాడాడు. అయితే, తిరుపతయ్య పని మీద ఊరెళ్లి గత సోమవారం సాయంత్రం వరకు రాలేదు. ఈ సమయంలోనే బ్యాంకు మేనేజరు, క్లర్క్ సాయంత్రం తిరుపతయ్య ఇంటికి వచ్చారు. ఆయన భార్యను నానా రకాలుగా దుర్భాషలాడారు. 'నీ మొగుడు యేడికి పొయ్యిండు. ఈ రోజు బ్యాంకు లోను చెల్లిస్తానన్నాడు' అని అన్నారు. దీంతో తిరుపతయ్య భార్య లలిత 'నా దగ్గర డబ్బులు లేవు. మా అయన వచ్చిన తర్వాత రేపు చెల్లిస్తాం సారు..' అని చెప్పింది. అయినప్పటికీ వినకుండా నానా మాటలు అని కుట్టుమిషన్ను లాక్కెళ్లారు. డబ్బులు కట్టకుంటే ఇల్లు కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. తరుపతయ్య విషయం తెలుసుకొని, డబ్బులు కట్టలేదని కుట్టు మిషన్ లాక్కెళ్లడంతో ఊర్లో పరువు పోయిందని మనస్తాపానికి గురయ్యాడు. బ్యాంకు మేనేజరుపై పోలీస్టేషన్లో కేసు పెట్టాడు.
కోడేరు మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు నుంచి ఆ ప్రాంత ప్రజలు దాదాపు రూ.నాలుగు కోట్ల వరకు వివిధ రకాల రుణం తీసుకున్నారు. వీరిలో రెండు నుంచి 10 లక్షల వరకు తీసుకున్న వారూ ఉన్నారు. 15 ఏండ్లుగా ఈ అప్పులు తిరిగి చెల్లించలేదు. అందులో పెత్తందారులే ఎక్కువ. వారందరినీ వదిలేసి ఎరుకల కులానికి చెందిన తిరుపతయ్య రూ.20 అప్పు కింద బ్యాంకు మేనేజర్ కుట్టుమిషన్ లాక్కెళ్లడం గమనార్హం.
కాళ్లావేళ్లా పడ్డ కనికరించలేదు: ఎరుకల లలిత
రోజూ బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకునే కుట్టు మిషన్ను లాక్కెళ్లారు. కాళ్లా వేళ్లా పడ్డా వినలేదు. నా భర్త లేనప్పుడు బ్యాంకు మేనేజర్ వచ్చి నన్ను హెచ్చరించాడు. కన్నీరు పెట్టుకున్నా కనికరించలేదు. మేం భూమి, బుట్ట లేనోళ్లం. మిషన్ కుడితేనే పూట గడిచేది. రుణం చెల్లించలేదని నానా దుర్భాషలాడి చేతికింది మిషన్ను లాక్కెళ్లారు.
పై అధికారుల ఒత్తిడి ఉండబట్టే: ఆంధ్రా బ్యాంకు మేనేజర్
కుట్టు మిషన్ను తీసుకెళ్లడం నా సొంత నిర్ణయం కాదు. పై నుంచి ఒత్తిడి ఉండబట్టే గట్టిగా అడిగి మిషన్ తీసుకెళ్లాల్సి వచ్చింది. డబ్బులు కడితే మిషన్ ఇచ్చేస్తాం. అతనికి మరో రూ.రెండు లక్షల రుణం కూడా ఇస్తాం. దీన్ని ఇంతటితో వదిలేయండి. నేను ప్రజల కోసం పని చేస్తున్నాను. రుణం తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తేనే కదా.. మేం ఇతరులకు రుణ సౌకర్యం కల్పించేది.
కేసు నమోదు చేస్తాం :ఎస్ఐ షఫీ- కోడేరు
నాకు మూడు రోజుల కిందటే బాధితుని నుంచి దరఖాస్తు వచ్చింది. మేనేజరును కూడా ఫొన్లో సంప్రదించాను. ఆయన వ్యవహార శైలి బాగా లేదు. నేను ఫోన్ చేస్తే కేసు పెట్టుకోండి అన్నారు. బాధితులకు న్యాయం చేస్తాను.