Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవరి డబ్బా వారిదే
- అందరూ దేశాన్ని ఏలే వారే
- 'నొప్పించక...తానొవ్వక' తీరులో పంచాంగ శ్రవణాలు
* ఎస్ఎస్ ఆర్ శాస్త్రి
''రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది. తిరిగి అధికారంలోకి వస్తారు''...ఇది అధికారపార్టీల సర్కారు పంచాంగం. ''రాష్ట్రంలో రాజకీయమార్పు తధ్యం. ఇప్పుడున్న ప్రభుత్వం కూలిపోయి ఆ స్థానంలో మీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఇప్పటి సర్కారు పట్టించుకోవట్లేదు''....ఇది ప్రతిపక్షాల పంచాంగం... నవ్విపోదురు గాక... అన్నట్టు తయారైంది తెలుగురాష్ట్రాల్లో పంచాంగ శ్రవణాల తీరు. పంచాంగ శ్రవణం పేరుతో పండితులు చెప్పే వాక్కులు విని వేదికపైనున్న వారు ఆహా...ఓహౌ అని భ్రమించొచ్చుగాక! వినే జనం విస్తుపోతున్నారు. అధికారపక్షానికి మళ్లీ మీదే అధికారం అని...ప్రతిపక్షాలకు మీరే అధికారంలోకి వస్తారంటూ ఎవరికి అనుకూలంగా వారికి నివేదికలు ఇచ్చి.. పండితులు తమ నివేదనల నైవేద్యంతో సంతృప్తి పడుతున్నారు. ప్రపంచంలో ఏ ఒక్కరి హస్తరేఖలు మరొకరితో మ్యాచ్ కావు అనే సత్యాన్ని సైన్స్ తేల్చిచెప్పింది. అందుకే సర్కారు స్కీములన్నింటికీ బయోమెట్రిక్ పేరుతో వేలిముద్రల్ని తప్పనిసరి చేశారు. రేషన్షాపులో రూపాయి కిలో బియ్యం తీసుకోవాలన్నా...వేలిముద్ర వేయాల్సిందే అనే నిబంధనను ఈ ప్రభుత్వాలే కదా అమలు చేస్తోంది. ఓ తల్లి గర్భం నుంచి పుట్టిన కవల పిల్లలకు కూడా ఒకే తరహా జాతకాలు ఉండవని ఈ పంచాంగ కర్తలే చెప్తుంటారు. అలాంటప్పుడు అధికార, ప్రతిపక్షాలకు 'మీదే అధికారం' అంటూ స్వోత్కర్షలు చేస్తే...జనం ఎలా నమ్ముతారు. ఖచ్చితంగా పంచాంగం హేతుబద్ధతను ప్రశ్నిస్తారు! పంచాంగాలతోటే ప్రభుత్వాలు నడిస్తే...ఇన్ని రాజకీయ పార్టీలు, ఎత్తుగడలు, పోరాటాలు, ప్రజాఉద్యమాలు ఏం అవసరం. ''గతి లేని రాజుకు మతి లేని మంత్రి'' అని ఓ సామెత...అలాగే 'యథారాజా...తధా ప్రజ' అనీ అంటారు. ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల సర్కార్ల వారు చెప్పించిన పంచాంగ శ్రవణాలు ఈ కోవలోవే! ఏ మాత్రం హేతుబద్ధత లేని అంధ విశ్వాస విషయాలకు సెంటిమెంట్ను రంగరించి పాలకులు ప్రజల్లోకి వదులుతున్నారు.
తెలంగాణ సర్కారు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ..దిగ్విజయ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, బంగారు తెలంగాణ అతి త్వరలో సిద్ధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక సీఎం కేసీఆర్కు రాజయోగం మరింత ఉన్నత స్థానంలో ఉంటుందని చెప్పారు. ఇక గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పంచాంగ శ్రవణంలో రాష్ట్రంలో అధికార మార్పు తధ్యమని, ఆపార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు భార్య, మనుమడితో హాజరయ్యారు. రాజమండ్రికి చెందిన వాసి సుబ్రహ్మణ్య శర్మ ఇక్కడ పంచాంగ శ్రవణం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటమీద నిలబడతాయని సెలవిచ్చారు. సీఎం చంద్రబాబుకు రాజయోగం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇక అక్కడి ప్రతిపక్ష వైఎస్ఆర్సీసీ శ్రీశైలంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో రాష్ట్రంలో అధికార మార్పు జరుగుతుందని, వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పారు. అమరావతిలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ నిర్వహించిన ఉగాది వేడుకల పంచాంగ శ్రవణంలో ఆయనకు మహరాజయోగం ఉన్నదని, అత్యంత ఉన్నతమైన పదవుల్ని అధిరోహిస్తారని అక్కడి సిద్ధాంతి చెప్పారు.
అసలు 'పంచాంగం' అర్ధం ఎంతమందికి తెలుసు. దీన్ని పరిగణించని వారూ బతుకుతున్నారు కదా! తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య అంటే ఆమడదూరం పరిగెడతారు. అదే అమావాస్యను తమిళనాడులో పుణ్యతిధిగా గుర్తిస్తారు. ఒకే దేశంలో భిన్న సంస్కృతులు ఉన్నప్పుడు...ఒకరికి తప్పు అయ్యింది, మరొకరికి ఒప్పు అయినప్పుడు ఈ పంచాంగాల విశ్వసనీయత ఏంటనే కనీస ఆలోచన కూడా పాలకులకు లేకుండా పోతోందంటే...వారు ప్రజల్ని ఏ దిశకు తీసుకెళ్తున్నారో ఇట్టే అర్ధమౌతోంది. ఆవు చేలో మేస్తే...దూడ గట్టున మేయదు కదా! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నదీ అదే. పండగలు, పబ్బాల సమయంలో తటస్థంగా వ్యవహరించాల్సిన పాలకులు అక్కడా సెంటిమెంట్ను పండించి, ఓట్బ్యాంక్ కోసం కక్కుర్తి పడుతుండటం చూస్తున్నదే. పంచాగ కర్తలు బతుకుదెరువుకోసమేమో... ఎవరి బాకా వారికి ఊదేసి 'మమ' అనిపించడమే చిత్రంగా అనిపిస్తుంది.