Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటు హక్కు కోల్పోయిన కోమటిరెడ్డి, సంపత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు కాకపోతే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నది. అంతకు ముందే నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా రానున్నాయా? కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఉప పోరు ఎదుర్కొక తప్పదా? అన్న చర్చలు జరుగుతున్నాయి. అందుకనుగుణంగానే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఉప ఎన్నికలపై రాజకీయ నాయకులు తలోరకంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చే చాన్స్ తక్కువగా ఉందని కొందరు, త్వరగానే ఎన్నికలు వస్తాయని మరికొందరు వాదిస్తున్నారు. బలమైన కారణం లేకుండానే సభ్యత్వాలు రద్దు కావడం వల్ల ఆ సానుభూతి వల్ల గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది.నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలొచ్చినా పైచేయి సాధిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి. అందుకు అధికార టీఆర్ఎస్ సమాయత్తమవుతున్నట్టు ఆ వర్గాలు అంటున్నాయి. సాధారణ ఎన్నికల సమయం మాత్రం 14 మాసాలు ఉండటంతో ఉప ఎన్నికలు ఇంత తొందరంగా రాకపోవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. సభ్యత్వాలు కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారు. దీంతో ఉపఎన్నికలు రాబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గవర్నర్ ప్రసంగ సమయంలో శాసనసభలో జరిగిన సంఘటనల నేపథ్యంలో స్పీకర్ వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యత్వం రద్దైయినట్టు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపింది. గెజిట్ ఆధారంగా వారికి రాజ్యసభ్య ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారని ఎన్నికలు సంఘం తేల్చింది. ఇదిలా ఉండగా సభ్యత్వాల రద్దుపై అంతకు ముందే కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆరువారాలపాటు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికనుగుణంగానే మే 20 తర్వాత నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.