Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలను చర్చించేందుకు గ్రామాల్లో వేదికలు : గుత్తా
నవతెలంగాణ-నల్లగొండటౌన్
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో నకిరేకల్ నియోజకవర్గ రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ల ఒక రోజు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గౌరవ్ఉప్పల్తో కలిసి ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,050 భూసార పరీక్షా యూనిట్లు అందజేయనున్నట్టు చెప్పారు. వ్యవసాయంపై అవగాహన నిమిత్తం రైతుకు ఒక కార్డును అందజేస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ రైతు సమస్యలను చర్చించేందుకు రూ. 12 లక్షల ఖర్చుతో వేదిక ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లాలో 137 రైతు వేదికలకు గానూ 124 రైతు వేదికలకు స్థలాన్ని గుర్తించామన్నారు. ఎకరాకు రూ.4వేలను వచ్చేనెల 19న రైతుల పేర చెక్కుల రూపంలో అందజేయనున్నట్టు చెప్పారు. ఎవరైనా రైతు పెట్టుబడి పైకాన్ని తీసుకోనట్టయితే ఆ డబ్బులు రాష్ట్ర రైతు సమాఖ్య సమితికి చేరుతాయన్నారు. పంటకు మద్దతు ధర కల్పించేందుకూ గ్రామ రైతు సమాఖ్య సమితులు అవగాహన కల్గిస్తాయన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీ సెంటర్లకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఆగ్రోప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో దాల్ మిల్లులు, టమాటా ఉత్పత్తి అయ్యే చోట కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు బీమా రూ.5లక్షలు వచ్చేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కార్యక్రమంలో రైతు సమాఖ్య సమితి జిల్లా అధ్యక్షులు రామచందర్ నాయక్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జి.నర్సింహారావు, కెవికే, కంపా సాగర్ ఇన్చార్జి డాక్టర్ బాలాజీ నాయక్, మత్స్య శాఖ జిల్లా అధికారి ఎం.చరిత, హార్టికల్చర్ జిల్లా అధికారి సంగీత లకీë, కోఆర్డినేటర్ శైలజ, మార్కెటింగ్ ఏడీ ఎండీ అలీం, తదితరులు పాల్గొన్నారు.