Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవసత్వాలు లేని రోడ్సేఫ్టీ అథారిటీతో ఒరిగేదెమింటీ!
- ఒక చైర్మెన్్..ఒక అటెండర్తో సరి
- విధులు బారెడు.. సిబ్బంది మూరెడు
- సర్కారుకు నచ్చని ఐపీఎస్ అధికారికి ఈ బాధ్యతలా..!
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ప్రతి ఏడాది వేల సంఖ్యలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో సర్కారు ఏర్పాటు చేసిన రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీ ఎలాంటి జవసత్వాలు లేక కునారిల్లుతోంది. దాదాపు నాలుగేండ్లుగా మూసిన తలుపులు తెరవని స్థితిలో అథారిటీ దుస్థితి నెలకొన్నది. అసలు ఈ అథారిటీని ఘనంగా ప్రారంభించిన పాలకులు రాను రాను తమకు నచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎలాంటి పని లేని ఈ ఈపోస్టులో ఒక మూలన కూచోబెట్టడానికి ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం ఉన్నది. రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రోడ్డు సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడటానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని ప్రకటిం చారు. ఈ విభాగానికి అన్ని రకాలా జవ సత్వాలు కల్పించి యాక్సిడెంట్స్పై అధ్యయనాలు నిర్వహించి నివారణ మార్గాలను సూచించడమే కాదు.. తగిన చర్యలను చేపడుతుందని తెలిపారు. అందుకు పోలీసు శాఖతో పాటు సంబంధిత శాఖలను కూడా ఈ విభాగం కోఆర్డినేట్ చేసేలా అధికారాలు ఇస్తున్నట్టు చెప్పారు. మాటలు కోటలు దాటుతాయి కాలు కడప దాటదన్నట్టు ఈ విభాగానికి ఒక చైర్మెన్ మరి కొంత మినిస్టీరియల్ స్టాఫ్ ను నియమించి అప్పటి సర్కారు చేతులు దులుపుకున్నది. తొలుత ఈ అథారిటీ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఏదో చేయబోతుందనే భ్రమలు కలిగాయి. కాని రాను రాను ఈ విభాగం రూపు రేఖలు మారిపోయాయి. ఆ సమయంలో ఈ విభాగాధిపతులుగా డీజీపీ స్థాయి అధికారులు ఎస్ఆర్ సుకుమార, ఎంవీ కృష్ణారావులు పని చేశారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఎస్వి రమణమూర్తి అథారిటీ చైర్మెన్ గా ఉన్నారు. విభజన క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించబడటంతో పాటు ప్రస్తుతం అథారిటీ ఏపీ విభాగానికి చైర్మె న్గా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అధారిటీకి చైర్మెన్ లేక అనాధగానే ఉండిపోయింది. రమణమూర్తి చైర్మెన్గా నియమితుడైన సమయంలో సచివాలయంలో సీఎం పేషీ ఉన్న భవనానికి ఆనుకుని ఉన్న భవనంలో ఒక మూలన ఉన్న అథారిటీ చైర్మెన్ చాంబర్లో కేవలం ఒక అటెండర్ మాత్రమే ఉన్నాడు. చైర్మెన్, అటెండర్ మాత్రమే ఉన్న ఈ విభాగం లో పని చేయలేని స్థితి ఎదురు కావడంతో రమణమూర్తి ఈ కార్యాలయానికి రావడమే మానేశారు. చాంబర్ కు ఎప్పుడు తాళం కప్పు వేలాడుతూ కనిపించేంది.
గత నాలుగేండ్లుగా ఊసులేకుండా పోయిన రోడ్డు సేఫ్టీ అథారిటీ గురించి ఒక్క సారిగా గుర్తుకు తెచ్చుకున్న సర్కారు ఇటీవలే రాష్ట్ర రైల్వే, రోడ్సేఫ్టీ విభాగం డీజీపీ టి.కృష్ణప్రసాద్ను చీఫ్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ విభాగం ఉండగానే పోలీసు శాఖలో రోడ్సేఫ్టీ విభాగాన్ని కూడా తెరచి దానికి అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తూ వస్తున్నారు. అసలే జవసత్వాలు లేకుండా, దానికి చీఫ్ లేకుండా అనాథగా పడి ఉన్న ఆధారిటీకి తాజాగా డీజీపీ స్థాయి అధికారిని చీఫ్గా నియమించి సర్కారు సాధించ దలుచుకుంది ఏమిటనే చర్చ ఐపీఎస్ వర్గాలలో సాగుతున్నది. మినిస్టీరియల్ స్టాఫ్ కానీ, కనీసం క్యాంప్ క్లర్కు లేని ఈ విభాగానికి డీజీపీ స్థాయి అధికారిని నియమించడం వలన ఒరిగేదేమిటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జవసత్వాలు లేని ఈ అథారిటీని తమకు నచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించే విభాగంగానే ప్రభుత్వం కొనసాగించదలు చుకుందనే అభిప్రాయాన్ని పలువురు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి పక్క రాష్ట్రం ఏపీలోనూ ఉన్నదని కొందరు ఐపీఎస్ అధికారులు పెదవి విరుస్తున్నారు.