Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసైన్డ్, అటవీ, కాందిశీకుల, దేవాదాయ, కౌలు భూములను సాగు చేస్తున్న పేద కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన శుక్రవారం లేఖ రాశారు. భూమి ఎక్కడుందో కూడా తెలియని ధనిక రైతులకు ఎన్నెకరాల భూమున్నా వారికి రాయితీనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు. కానీ వాస్తవంగా భూములపై కష్టపడి పనిచేస్తూ పంటలు పండించే పేద రైతులకు రాయితీనిచ్చేందుకు నిరాకరించటం శోచనీయమని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని 40 శాతం వాస్తవ సాగుదార్లకు పెట్టుబడి పథకం వర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులే ఉన్నారని వివరించారు. వీరందరికీ పెట్టుబడి పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని జూలకంటి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.