Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
డిగ్రీ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా తునికిపాడు గ్రామానికి చెందిన బుర్రి ధనలక్ష్మి(21) మధిరలోని ఓ ప్రయివేటు కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తండ్రి బుర్రి నర్సింహారావు ఇటీవల మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగొచ్చి భార్యను, కుమార్తె ధనలక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. దాంతో అదే రాత్రి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ధనలక్ష్మి శుక్రవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చింది. ఖమ్మం నుంచి విజయవాడ వైపుకు పోతున్న పుష్పుల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలస్వామి తెలిపారు. విద్యార్థిని మృతి వార్త తెలుసుకున్న విద్యార్థులు, యాజమాన్యం ఘటనా స్థలానికి, ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు.