Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర, కర్నాటకలో పెరిగిన రైతు ఆత్మహత్యలు : అసెంబ్లీలో మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమది రైతు ప్రభుత్వం కనుకనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గతంలో కంటే రైతు ఆత్మహత్యలు 53 శాతం తగ్గాయని చెప్పారు. పంట పెట్టుబడి ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందనీ, ఇక నుంచి ఆత్మహత్యల మాటే ఉండదన్నారు. శుక్రవారం నీటి పారుదల రంగం పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తెలంగాణలో 2015లో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. 2016లో ఆ సంఖ్య 645కు పడిపోయిందన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో 53 శాతం మేర రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. బీజేపీ పాలిత మహారాష్ట్రంలో 3661 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ రాష్ట్రంలో 145 శాతం, కర్నాటకలో 2079 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ రాష్ట్రంలో 35 శాతం మేర రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం పటిష్టం చేయడం వల్లనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. పంట పెట్టుబడిని ఇస్తామని చెప్పడంతో రైతుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇక ఆత్మహత్యలు ఉండవన్నారు. కాంగ్రెస్ హాయాంలో తెలంగాణలో 28లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తే తమ ప్రభుత్వం నాలుగేండ్లలోనే 21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించామన్నారు. భారీ, మధ్య తరహా, చిన్న నీటి వనరుల ద్వారా రూ.1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించి తీరుతామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. కోర్టుల్లో కేసులు వేసిన వారి వివరాలు తన దగ్గర ఉన్నాయని, తప్పుడు సమాచారంతో కోర్టులను కూడా మోసగించారని తెలిపారు. ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో పనులు జరుగుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు.