Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంధన సుంకాన్ని తగ్గిస్తాం: శంషాబాద్ ఎయిర్పోర్టు పదో వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ-శంషాబాద్
రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'దశాబ్దపు శ్రేష్టత' పేరుతో కార్యక్రమాన్ని ఎయిర్పోర్టులోని హజ్ టెర్మినల్ వద్ద శనివారం నిర్వహించారు. ముందుగా ఎయిర్పోర్టు విస్తరణపై జీఎంఆర్ సంస్థ చైర్మెన్ గ్రంధి మల్లిఖార్జునరావుతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం దేశంలోనే తొలి స్మార్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు సిటీని ప్రారంభించారు. దశాబ్దపు శ్రేష్టతను పురస్కరించుకుని స్మారక స్టాంప్, ఎన్వలప్ను విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఆర్జీఐ ఎయిర్పోర్టును దేశం గర్వించే విధంగా తీర్చిదిద్దినందుకు జీఎంఆర్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇంధన సుంకం తగ్గిస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో
50 ఎకరాల్లో రూ.750 కోట్లతో ఎయిర్పోర్టు సిటీ నిర్మాణం, ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. జీఎంఆర్ సంస్థ
చైర్మెన్ గ్రంధి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో ఎయిర్పోర్టు విస్తరణ వేగవంతం చేస్తామన్నారు. 2014లో ప్రయాణికుల వృద్ధిరేటు ఏడు శాతం ఉండగా నేడు అది 21 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రంపంచ శ్రేణి ప్రమాణాలతో జాతీయ ఆస్తులను సృష్టించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వప్నం సాకారం చేయడానికి జీఎంఆర్ ఎయిర్పోర్టు తోడ్పాటునందిస్తూ సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి డాక్టర్ పి.మహేందర్రెడ్డి, విమానయాన శాఖ కార్యదర్శి శ్రీరాజీవ్నయన్, చీఫ్ సెక్రెటరీ డాక్టర్ శైలేంద్రజోషి, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు టి.ప్రకాష్గౌడ్, తీగల కృష్ణారెడ్డి, జీఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్టు చైర్మెన్ శ్రీనివాస్ బొమ్మిడాల తదితరులు పాల్గొన్నారు.