Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి కోసం ఎకరాకు రూ. 8వేల ఖర్చు
- జనగామ జిల్లాలో 10వేల ఎకరాల్లో ఎండిన వరి
- భూగర్భజలాలు అడుగంటడంతోనే..
- పంట నష్టం అంచనాకు సిద్ధపడని అధికారులు
- ఎకరాకు 30వేల పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం), సీపీఐ
రిజర్వాయర్ల నుంచి నీళ్లు రాక..భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక..కంకులు పోసే దశలో వరిపైర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే జనగామ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఒక్క తడికి ఎకరాకు రూ.8 వేలు ఖర్చుపెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకుని పంటను కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు పంట నష్టంపై అధికారులు మాత్రం కన్నెత్తి చూడట్లేదు.
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
జనగామ జిల్లాలో 3లక్షలా 79వేల 925 ఎకరాల సాగు భూమి ఉండగా 33వేలా 720 బోర్లు, 22వేల 414 బావులున్నాయి. రబీలో 55వేల 945 ఎకరాల్లో వరిసాగైంది. రిజర్వాయర్లను గోదావరి జలాలను నింపకపోవడం, మరోవైపు ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవటం కారణాల వల్ల భూగర్భ జలాలు అడుగంటాయి. జనగామలో 10.45 మీటర్ల లోతులో నీరు ఉండాల్సి ఉండగా 11.87 మీటర్ల లోతుకు పడిపోయింది. రఘునాథపల్లిలో అశ్వరావుపల్లి రిజర్వాయర్ పక్కనే ఉన్న వరి పొలాలు ఎండిపోతున్నాయి. జనగామ మండలంలో చిటకోడూరు రిజర్వాయర్తో పాటు కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల కింద ఉన్న పంటలూ ఎండిపోతున్నాయి. స్టేషన్ఘనపురం, బొమ్మకూర్, గండిరామారం, వెల్దండ, చిటకోడూరు రిజర్వాయర్ల కిందా ఇదే పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో 10 వేల ఎకరాల్లోని పంట ఎండిపోయింది. జనగామ మండలం పెంబర్తిలో 250 ఎకరాల్లో వరి సాగు చేయగా 17 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. చౌడారం, మరిగడి, వడ్లకొండ, గానుగుపహాడ్, వెంకిర్యాల పసరమండ్ల, శామీర్పేట, గ్రామాల్లోనూ 400 ఎకరాల్లో వరి ఎండిపోయింది. రఘునాథపల్లి మండలంలోని వెల్ది, అశ్వరావుపల్లి, కోమల్లా, నిడిగొండ, మాదారం ప్రాంతాల్లోనూ వరి అధిక సంఖ్యలో ఎండిపోయింది. పంటలు ఎండుతున్నా అధికారులు అంచనా వేయడం లేదు.
ట్యాంకర్లతో వరికి నీరు
లింగాలఘనపురం మండల కేంద్రానికి చెందిన బొంకూరి గట్టుమల్లుకు నాలుగెకరాలుంది. బావితో పాటు బోరూ ఉండటంతో ఎకరం వరినాటు వేయించాడు. వరిపైరు కంకి పోసింది. మరో రెండు తడుల నీరు పెడితే పంట చేతికి వస్తుందన్న దశలో బోర్లు పోయలేదు. ట్యాంకర్కు 800 రూపాయల చొప్పున చెల్లించి నెల్లుట్ల నుంచి 10 ట్యాంకర్ల నీటిని తెప్పించి చేనుకు పెట్టించాడు. ఐదారు రోజుల తరువాత మరో 10 ట్యాంకర్ల నీరు కొనుగోలు చేసి పొలం పారిస్తానని చెప్పాడు. పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక నీటిని కొనుగోలు చేసి పొలం పారిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎకరాకు 30వేల రూపాయల పరిహారం ఇవ్వాలి: సీపీఐ(ఎం), సీపీఐ
కరువు ప్రాంతమైన జనగామ జిల్లాలో ఇప్పటికే 10వేల ఎకరాల్లో వరి పంట ఎడిపోయిందని, అధికారులు పరిశీలించి ఎకరాకు రూ. 30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. పై రెండు పార్టీలు వేర్వేరుగా జనగామలోని వివిధ గ్రామాల్లో పర్యటించాయి.. ప్రతి గ్రామంలో పంట ఎండుతున్నందున ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.