Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- విలేకరులు
రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతుండటం.. వడగాడ్పులూ పెరుగుతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వేడికి వడదెబ్బకు గురై మృతిచెందుతున్నారు. గురువారం వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆరుగురు ప్రాణం కోల్పోయారు.
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కన్నారావుపేట గ్రామ శివారు పద్మాపురానికి చెందిన తూసరి పద్మ(46) కూలీ పనికి వెళ్లింది. ఎండ ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం పద్మ ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోంది. తోటి కూలీలు నర్సంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.
భూపాలపల్లి జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావ్పల్లి చివారు జోడుపల్లికి చెందిన కందుల రాజేష్(47) పొలానికి పోయాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోయాడు. కండ్లు తిరుగుతున్నాయని, గొంతు తడి ఆరిపోతున్నదని భార్యకు చెప్పాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరిలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు.
నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి నకిరేకల్కు చెందిన ముత్యాల రాములు(60) పొలం పనుల కోసమని వచ్చాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతను తట్టుకోలేక గ్రామంలోని బస్షెల్టర్లో సేదతీరాడు. ఆ సమయంలో అస్వస్థతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రజనీకర్రెడ్డి తెలిపారు. నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల నర్సింహా(36) ఉపాధి హామీ చట్టం కింద నాలుగు రోజులుగా చెరువు పూడికతీత పనుల్లో నిమగమయ్యాడు. గురువారం ఉదయం పని ప్రదేశంలోనే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు వెంటనే నర్సింహాను నకిరేకల్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం విభాళ్లపురం గ్రామానికి చెందిన దామల రామచంద్రు(70) బుధవారం పత్తి అమ్మడానికి ఖమ్మం మార్కెట్కు పోయాడు. తిరిగి వస్తున్న క్రమంలో ఖమ్మం మందులషాపు సమీపంలో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు ఎస్ఐ రాము తెలిపారు. కోదాడ పట్టణం 15వ వార్డులో నివసిస్తున్న రంగానర్సింహారావు(71) కూడా వడదెబ్బతో చనిపోయాడు.