Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 30 వరకు 'ఏకీకృతం' అమలుపై స్టే
- మే నెలలో బదిలీలు ఉంటాయన్న సర్కార్
- ప్రాథమిక ఏర్పాట్లు కూడా ప్రారంభించని అధికారులు
- బదిలీలు, పదోన్నతులపై టీచర్లలో ఆందోళన
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
'' మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తాం. ఏకీకృత సర్వీస్రూల్స్ స్టేటస్కో ఆధారంగా షెడ్యూల్, నిబంధనలు రూపొందిస్తాం. ఏప్రిల్లో మరోసారి సమావేశం అవుదాం..'' ఇవీ మార్చి 31న సచివాలయంలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో డిప్యూటీసీఎం కడియం శ్రీహరి మాటలు. కానీ ఏప్రిల్ నెలాఖరు వచ్చినా టీచర్స్ యూనియన్లతో మాత్రం సమావేశం కాలేదు. దీనికితోడు విద్యాశాఖలో కనీసం బదిలీలకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. రెండురోజుల క్రితం సర్వీస్రూల్స్పై స్టేటస్కో జూన్ 30వరకూ న్యాయస్థానం పొడగించింది. దీంతో ఉపాధ్యాయవర్గంలో తీవ్ర ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గతంలో వీరికి ప్రతి ఏటా వేసవి సెలవులో సాధారణ బదిలీలు జరిగేవి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బదిలీల షెడ్యూల్ మారిపోయింది. చివరిసారిగా 2015 జూన్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు నిర్వహించింది. ఆ సమయంలో అక్రమాలు జరిగాయనీ ముగ్గురు డీఈఓలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి బదిలీలను ప్రభుత్వం నిషేధించింది. ఉపాధ్యాయ సంఘాలు అనేక ఆందోళనలు చేసినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఈనేపథ్యంలో 54 ఉపాధ్యాయ సంఘాలు...జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్ (జేసీటీయూ)గా ఏర్పడి బదిలీల డిమాండ్ను మరోసారి ముందుకు తీసుకొచ్చాయి. సమస్యలను పరిష్కరించకపోతే పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకణం చేయబోమని హెచ్చరించాయి. దీంతో స్పందించిన డిప్యూటీసీఎం కడియం శ్రీహరి మార్చి 31న సచివాలయంలో జేసీటీయూ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మే నెలలో బదిలీలు నిర్వహించేందుకు ఆయన అంగీకరించారు. ఈ సమావేశంలోనే సర్వీసు రూల్స్కు అమలుపై హైకోర్టులో స్టే ఉండటంపైనా చర్చించారు. దీనిప్రకారం ఒకవేళ స్టేటస్కో కొనసాగితే, పాత పద్దతిలోనే బదిలీలు నిర్వహిస్తామనీ, లేకపోతే కొత్తగా నిబంధనల ప్రకారం చేపడతామని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి ఉపాధ్యాయులకు హామీనిచ్చినట్టు ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. పదోన్నతులను కోర్టు కేసు పరిష్కారమయ్యాక నిర్వహిస్తామని వారికి హామీనిచ్చారు.
ప్రాథమిక ఏర్పాట్లు కూడా చేయని విద్యాశాఖ
మేలో బదిలీలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం..దానికి సంబంధించిన ఏర్పాట్లపై దృష్టిసారించలేదు. కనీసం ప్రాథమిక ఏర్పాట్లు కూడా చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించలేదు. దీంతో ఆ శాఖ అధికారులు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తున్నారు. సర్కారు నుంచి ఆదేశాలు మేరకే ముందుకు పోతామని స్పష్టం చేస్తున్నారు. ఉపాధ్యాయ నియా మకాలను కూడా పాత జిల్లాల ప్రకారమే నిర్వహిస్తామని రెండు రోజు ల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 8,792 పోస్టుల భర్తీ కోసం టీచర్ రిక్రూ ట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) నిర్వహించినా, ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు. పాఠశాలలు ప్రారంభం నాటికి కొత్త టీచర్లు బడుల్లో ఉంటారని ఉపముఖ్యమంత్రి కడియం పలుమార్లు ప్రకటించారు. దీంతో నియామకాల కంటే ముందే బదిలీలు చేపట్టాల్సి ఉంది. బదిలీల షెడ్యూల్ దాదాపు 40 రోజుల నుంచి రెండు నెలల పాటు ఉంటుంది. కాబట్టి మే నెలలో ప్రక్రియ ప్రారంభిస్తేనే జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముంది. లేకపోతే ఆ తర్వాత కూడా బదిలీలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడనుంది. ఆ తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. కాబట్టి అంతకంటే ముందే వీటిని నిర్వహించాల్సి ఉంది.
హామీని నిలబెట్టుకోవాలి: చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మే నెలలో బదిలీలు నిర్వహిస్తామని డిప్యూట ీసీఎం కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలకు హామీనిచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాలి. మూడేండ్ల నుంచి బదిలీలు లేకపోవడంతో ఉపాధ్యాయులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిలింగ్ను పారదర్శకంగా నిర్వహించాల్సింది పోయి, గతంలో అక్రమాలు జరిగాయనే పేరుతో బదిలీలు నిలిపివేయడం సరికాదు. ఇప్పటికైనా బదిలీలకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే జేసీటీయూ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదు.