Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28న చర్చలకు డీఎంఏ ఆహ్వానం
- అప్పటి వరకు సమ్మె యధాతథం
- తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో (గేటర్ హైదరాబాద్ మినహా) కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులందరికీ జీవో నెం 14లో పేర్కొన్న వేతనాలను అమలు చేయడానికి ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన రెండో రోజు సమ్మె జయప్రదమైందని తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈమేరకు గురువారం జేఏసీ నేత పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉధృతంగా జరుగుతుండడంతో మున్సిపల్ అధికారులు స్పందించారని పేర్కొన్నారు. ఈ నెల 28న జేఏసీ నాయకత్వం చర్చలకు రావాలని ఆహ్వానించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తింగా జరుగుతున్న సమ్మె జయప్రదంగా కొనసాగుతుందన్నారు. సమ్మెను విజయవంతం చేస్తున్న కార్మికులకు అభినందనలు తెలిపారు. కౌన్సిళ్లు వేతనాలు పెంచుతామని తీర్మానం చేసినా...వేతనాల అమలు కోసం ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేయాలంటూ కార్మికులు ఎంతో పట్టుదలతో సమ్మె ఉధృతం చేయడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పాత పద్దతి ప్రకారమే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని మున్సిపాల్టీల్లో పాలకవర్గాలు, అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ సమ్మెలో పాల్గొంటే విధుల నుంచి తొలగిస్తామని, పెంచే వేతనాలను ఇవ్వబోమని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే సమ్మె ఉధృతం చేస్తామన్నారు. అందులో భాగంగా అత్యవసర సేవలైన మంచినీరు, వీధిదీపాలను సైతం బంద్ చేస్తామని ఆయన హెచ్చరించారు.