Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత లోతుకు పోయాయి. గత సంవత్సరం మార్చితో పోలిస్తే .94 మీటర్లు భూగర్భ జలమట్టం నమోదయింది. గత సంవత్సరం మార్చి నెలలో సగటు భూగర్భ జలాలు 10.96 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం మార్చి నెలలో 11.90 మీటర్ల లోతులో ఉన్నట్టు నమోదయింది. మార్చి నెల గణాంకాలను భూగర్భ జల శాఖ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 810 బావుల నుంచి పిజియోమీటర్ల ద్వారా భూగర్భ జలాల వివరాలను సేకరించారు. రాష్ట్రంలోని 67 మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో ఉండగా 94 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతుకు పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో 10 శాతం తక్కువగా వర్షపాతం నమోద యిందని, ఫలితంగా కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గాయని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో 0.30 మీటర్ల లోతులోనే భూగర్భ జలం నమోదు కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 53.51 మీటర్ల లోతులో ఉన్నట్టు నమోదయింది. ఆయకట్టు ప్రాంతమైన నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భూగర్భ జలాల పరిస్థితి మెరుగ్గా ఉన్నది. ఈ జిల్లాల్లో 5 మీటర్ల కంటే పైకి భూగర్భ జలాలు ఉండగా సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతుకు పడిపోయింది.