Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరల్ ఫ్రంట్పై తీర్మానం
- పార్టీ నేతల ఫీడ్బ్యాక్ తీసుకోనున్న కేసీఆర్
- ఫ్లెక్సీలు, బ్యానర్లతో కొంపల్లి రోడ్ గులాబీమయం
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 17వ ప్లీనరీకి కొంపల్లిలో ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి ప్రతినిధుల నమోదు ప్రారంభమౌతుంది. సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు ప్లీనరీకి వస్తారు. మధ్యాహ్నం వరకు పార్టీ తీర్మానాలపై చర్చ జరుగుతుంది. అనంతరం 12 గంటల సమయంలో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి దాదాపు రెండు గంటల సేపు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఫ్రంట్ లక్ష్యాలు, జాతీయ రాజకీయాల ప్రవేశం ఆవశ్యకత వంటి అన్ని విషయాలను ఆయన పార్టీ ప్రతినిధులకు వివరిస్తారు. ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణం అని పేరు పెట్టారు. ఆరు అడుగుల ఎత్తయిన ప్లీనరీ వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వేదికను గులాబీ రంగుతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఫెడరల్ ఫ్రంట్ పైనే చర్చ
కేంద్ర రాజకీయాల వైపు దృష్టి మరల్చిన సీఎం కేసీఆర్..బిజెపి, కాంగ్రెస్లకు ప్రత్యామ్నా యంగా మూడో ఫ్రంట్ కోసం కసరత్తు చేస్తు న్నారు. దీనికోసం పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి, తృణమూల్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్లతో పాటు పలువురు ప్రముఖులతో ఇప్పటికే సంప్రదింపులు జరి పారు, త్వరలో ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ను కూడా కలవనున్నారు. ప్రభు త్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం తనయుడు, రాష్ట్ర మంత్రి కె తారకరామారావు తాజాగా ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ప్రాధాన్యతను వివరించారు. ఆయన కూడా సానుకూలత వ్యక్తంచేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఫ్రంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ వేదికలపై ఇప్పటివరకూ చర్చ జరగలేదు. తొలిసారి నిర్వహిస్తున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్పై శ్రేణులతో సుదీర్ఘంగా చర్చిం చనున్నారు. ఫ్రంట్లో టీఆర్ఎస్ నిర్వహించే పాత్ర, భవి ష్యత్ ప్రణాళికలను ఆయన వివరిస్తారు. అనంతరం అందరి అంగీకారంతో తీర్మానం కూడా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే వచ్చే సాధారణ ఎన్నికలకు సంబంధించి కూడా రాజకీయ తీర్మానాలు ఉంటాయి.
వేర్వేరుగా గ్యాలరీలు
దాదాపు ఎనిమిది ఎకరాల స్థలంలో ఒక ఎకరాన్ని సభా ప్రాంగణానికి కేటాయించారు. మిగిలిన దానిని పార్కింగు, భోజన శాలలకు కేటాయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు కూర్చునేందుకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కుర్చీలు, సోఫా లు ఏర్పాటు చేశారు. ప్రాంగ ణం వద్ద సీఎం బసకు వీలు గా అక్కడి గదుల్లో తాత్కా లిక ఏర్పాట్లు చేసి, బ్యారికేడ్లను అమర్చారు. వేసవి తాపం దష్ట్యా వేదిక, ప్రాంగణంలో కూలర్లను అమర్చారు. పార్టీ శ్రేణుల కోసం మజ్జిగ, నీరు, అంబలి కేంద్రాలను సిద్ధం చేశారు.
స్వాగత తోరణాలు
ప్లీనరీని పురస్కరించుకొని పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మేయరు బొంతు రామ్మోహన్ల ఆధ్వర్యంలో వేదిక, ప్రాంగణంతోపాటు.. రాజధానికి వచ్చే ప్రధాన రహదారులకు నలువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు, స్వాగత తోరణాలతో ముస్తాబు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లు, షెల్టర్లు, ప్రధాన కూడళ్లు, మెట్రో పిల్లర్లు, ఆర్టీసీ బస్సులపైనా గులాబీ ప్రచార ఫ్లెక్సీలను అతికించారు. వేదిక ప్రాంగణం, తెలంగాణభవన్ వద్ద టీఆర్ఎస్ బెలూన్లను ఎగురవేశారు. ప్రచార చిత్రాలలో కేసీఆర్ చిత్రాలు, అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పొందుపరిచారు. మేడ్చల్కు వెళ్ళే దారులన్నీ గులాబీమయమయ్యాయి. ఎక్కడ చూసినా కారు, కేసీఆర్, కేటీఆర్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.