Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందు దీనికి వివరణ ఇవ్వండి :హైకోర్టు
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ల బహిష్కరణ చెల్లదని ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 12 మంది దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై గురువారం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆ ఇద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిషికేషన్ చెల్లదని ఇటీవల సింగిల్ జడ్జి సంచలన తీర్పు చెప్పిన విషయం విదితమే. ఈ కేసులో తమను కూడా ప్రతివాదులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రవీందర్రెడ్డి మరో 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభ నుంచి తమను బహిష్కరించడం చెల్లదని కోమటిరెడ్డి, సంపత్లు దాఖలు చేసిన ప్రధాన కేసులో ఈ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కానందున వీరు సింగిల్ జడ్జి తీర్పును తప్పుపడుతూ అప్పీల్ చేసేందుకు హైకోర్టు అనుమతి పొందాలి. అందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు లాయర్కు హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. ప్రతిపక్ష సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేస్తే వారికి రక్షణ ఎక్కడ ఉన్నట్లు? ప్రతిపక్ష సభ్యుల ఉంటే ఇబ్బందిగా ఉందని బహిష్కరించేస్తారా? కోమటిరెడ్డి మైక్ విసిరారని బహిష్కరించితే సంపత్ను ఎందుకు బహిష్కరించారు? వీటికి వివరణ ఇవ్వండి.. అని బెంచ్ పేర్కొంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదిస్తూ.. అసెంబ్లీలో గవర్నర్ నర్సింహన్ ప్రసంగ సమయంలో కోమటిరెడ్డి, సంపత్లు సభ ప్రతిష్ట దిగజారేలా వ్యవహించినప్పుడు పిటిషనర్లు (12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు) ప్రత్యక్ష సాక్షులని, సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసేందుకు డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పు ఏకపక్షంగా ఉన్నదని, దానికి చట్టబద్ధత లేదన్నారు. అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడేందుకు సభలోని సభ్యులు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని, కోమటిరెడ్డి, సంపత్ల తీరు ఎంతమాత్రం సమర్ధనీయంగా లేనందునే వారిని సభ నుంచి బహిష్కరించినట్టు చెప్పారు. సభ ప్రతిష్ట మంటగలిపే సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నది. అయితే దీనిపై రాజ్యాంగంలో నియమాలేమీ లేవు. 184(3) అధికరణ మేరకు సభకు అసాధారణ అధికారాలుంటాయి. తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని సింగిల్ జడ్జి తప్పుపడుతూ తీర్పు చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకం. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పుకు కూడా వ్యతిరేకమే. సభ తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేనేలేదు. మండలి చైర్మెన్ స్వామిగౌడ్పై హెడ్ఫోన్ విసిరినట్టు కోమటిరెడ్డి, సంపత్లు వాళ్ల పిటిషన్లోనే రాశారు. వాళ్లు హెడ్ఫోన్ విసిరినట్టు మొత్తం సభలోని సభ్యులంతా సాక్షులే. స్వామిగౌడ్ను గాయపరిచారు. వాళ్లపై సభ కఠిన చర్యలు తీసుకోవడం ఎంతమాత్రం తప్పుకాదు. సభ ఆమోదంతోనే వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.. అని వైద్యనాథన్ వాదించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రశ్నల వర్షం
దీనిపై బెంచ్ స్పందిస్తూ.. పిటిషన్లో హెడ్ఫోన్ విసిరినట్టుగా ఎక్కడుందో చెప్పాలి.. కోమటిరెడ్డి, సంపత్లను బహిష్కరించే తీర్మానంలో హెడ్ఫోన్తో స్వామి గౌడ్పై దాడి చేసిన కారణాన్ని పేర్కొన్నారా.. కోమటిరెడ్డి హెడ్ఫోన్ విసిరితే సంపత్ను ఎందుకు బహిష్కరించారు.. అయినా వారిపై చర్య తీసుకునేముందు వారికి చివరి అవకాశం ఇవ్వాలి కదా.. అని ప్రశ్నల వర్షం కురిపించింది. వీటిపై శుక్రవారం జరిగే విచారణలో వివరణ ఇవ్వాలని టీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ను బెంచ్ ఆదేశించింది. అదే సమయంలో పన్నెండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ చేసుకునేందుకు అర్హత ఉన్నదో లేదో కోమటిరెడ్డి, సంపత్ల వాదనల నిమిత్తం కేసు విచారణను శుక్రవారానికి వాయిదా పడింది.