Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధంతి సభలో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు రాఘవులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేద ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహావ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) పొలి ట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో, సామాజిక సేవలో, నిజాం నిరంకుశ పాలనను కూలదోయడంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. పెత్తందారులు, భూస్వాములు కొనసా గిస్తున్న శ్రమ దోపిడీకి, అంటరాని తనం, వివక్ష, అణచి వేతకు వ్యతిరేకంగా అట్టడుగు శ్రమజీవులుగా వున్న వ్యవసాయ కూలీలను ఏకం చేసి భూస్వాములపై తిరుగు బాటు చేసిన నాయకుడని గుర్తుచేశారు. హైదరాబాద్ శివారులోని గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సుందరయ్య 33వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలు గు రాష్ట్రాలకు గొప్ప ప్రత్యామ్నాయ సాంస్కృతిక నిలయంగా కేంద్రం ఉండాలని ఆకాంక్షించారు. విజ్ఞానం, సంస్కృతి వ్యాపారమయంగా మారిన నేపథ్యంలో ప్రజావసరాల కోసం దీనిని ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. తొలిసారిగా కేంద్రంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నం దుకు హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన సుందరయ్యకు విగ్రహాలంటే ఇష్టంలేదని..ఆయనపై అభిమానంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. విగ్రహాన్ని నెలకొల్పడం కన్నా సుందరయ్య కృషిని శాశ్వతంగా కొనసాగించేందుకు గుర్తుగా బాగ్లింగంపల్లి ఆయన పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అందులో సాంస్కృతిక, సాహిత్య విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. 'సుందరయ్యకు సేవా, విజ్ఞాన సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ. పోరాటాల్లో, ఉద్యమాల్లో ముందుండేవారు. కమ్యూనిస్టు ఉద్యమంలోకి రాకముందు అనేక సేవ కార్యక్రమాలు చేశారు. జాతీయోద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో స్వచ్చంద సేవకుడిగా పనిచేశారు. అనేక దీక్ష, సత్యాగ్రహ శిభిరాల్లో చురుగ్గా పాల్గొన్నారని' గుర్తుచేశారు. ముఖ్యంగా ప్రసవ సమస్యలతో అప్పట్లో అనేక మంది మృతి చెందేవారు. ఇది గ్రహించిన సుందరయ్య ప్రత్యేక శిక్షణ తీసుకొని తానే స్వయంగా ప్రసవాలు చేశారు. చాలా మంది సిగ్గుపడకపోగా.. సుందరయ్య చేస్తేనే ప్రసవం చేసుకుంటామని మహిళలు ముందుకు వచ్చేవారని గుర్తుచేశారు. ఆ తరువాత వివిధ మహిళా సంఘాలు సుందరయ్యతో శాస్త్రీయ శిక్షణ తీసుకొని ఆయా గ్రామాల్లో ప్రసవాలు చేశారన్నారు. ఇక, వ్యాపార మోసాలను తగ్గించేందుకుగాను తానే స్వయంగా కిరాణ దుకాణం ఏర్పాటు చేసి తక్కువ ధరకు సరుకులు విక్రయించారని చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొని రూపాయికే కిలో బియ్యాన్ని విక్రయించి ప్రజల మన్ననలు పొందారని కితాబిచ్చారు. 'సుందరయ్యకు పుస్తకాలంటే ఎంతో ఆసక్తి. ప్రపంచంలో ఎవరివద్ద ఉండనన్నీ ప్రత్యేక పుస్తకాలు, మ్యాపులు ఆయన సొంతం. మరణించాక పుస్తకాల భద్రత కోసం బాగ్లింగంపల్లిలో గ్రంథాలయం ఏర్పాటు చేశాం. వరదల వల్ల పుస్తకాలన్నీ తడిసి ముద్దగా మారాయి. అవి పాడైపోకుండా మైనస్ 20 డిగ్రీల వద్ద కోల్డ్స్టోరేజీలో ఏడాదిపాటు భద్ర పరిచాం. ఈ నీరు మంచుగా మారిన తరువాత ఒక మిషన్తో ఆ మంచును తొలగించి ఆ పుస్తకాలను మాములు స్థితికి తీసుకొచ్చాం. ఇదంతా అమెరికాలోని చికాగో యూనివర్సిటీ సహకారంతో చేశాం. ఆ విధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పుస్తకాలను పునరుద్ధరణ చేసిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందని' చెప్పారు. ప్రస్తుతం ఆ పస్తకాలను గచ్చిబౌలి కేంద్రంలో ఉంచామని, దీనిని త్వరలో యాత్రాస్థలంగా తీర్చిదిద్దు తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకనుగుణంగా ఇప్పటికే భవనాన్ని ప్రత్యేక డిజైన్ చేస్తున్నామని చెప్పారు. కేంద్రంలో ఒక థియేటర్, వెయ్యిమందికి సరిపడేలా ప్రత్యేక ఆడిటోరియం, అత్యాధునిక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఆర్ట్ గ్యాలరీలతో పేదలందరికీ ఉపయోగపడేలా అనేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. లైబ్రరీలో ఉన్న 70 వేల పుస్తకాల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్టు చెప్పారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ సైకిల్పై పార్లమెంట్కు వెళ్లిన ఘనత సుందరయ్యకే దక్కుతుందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు, కేంద్రం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.ప్రభాకర్, దాదసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉమా మహేశ్వర్రావు, లైబ్రరీ ఇన్ఛార్జి విద్యాసాగర్రావు, శేరిలింగంపల్లి సీపీఐ (ఎం) నాయకులు శోభన్లు ప్రసంగించారు. అనంతరం సిబ్బంది నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.