Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ సదస్సులో ప్రొ. వాస్తవ్యరాజు
నవతెలంగాణ-వరంగల్
సహజ వనరులు విపరీతంగా ధ్వంసమవుతున్న ప్రస్తుత తరుణంలో జీవవైవిధ్యం కాపాడబడాలంటే ప్రకృతి వనరులపై ఆధిపత్యం ప్రజల చేతుల్లో ఉండాలని ప్రొఫెసర్ వాస్తవ్యరాజు అన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర పర్యావరణం సబ్కమిటీ ఆధ్వర్యంలో ధర్మప్రకాశ్ అధ్యక్షతన ఆదివారం వరంగల్ కాకతీయ జూపార్క్లో రాష్ట్రస్థాయి జీవవైవిధ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై ప్రకృతి సేవల గురించి చెప్పాలన్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ.. 1980లో తెచ్చిన ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ యథాతథంగా అమలు చేస్తే పర్యావరణ విధ్వంసాన్ని చాలావరకు ఆపొచ్చన్నారు. ఇందుకు ప్రజలను చైతన్యం చేయడంలో భాగంగా క్లబ్లు, పర్యావరణ సంబంధిత దినోత్సవాలు, తడి చెత్త, పొడిచెత్త వేరు చేసేలా విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శ్రీనాథ్ మాట్లాడుతూ.. శాస్త్ర ఫలాలు ప్రజలందరికీ చేరేలా వివిధ రంగాల ద్వారా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శ్యాంసుందర్ చేత తయారు చేయబడిన జీవవైవిధ్య లోగో, ప్రొఫెసర్ రతన్సింగ్ రాసిన జీవవైవిధ్యం రచనలు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో రూరల్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, మెజీషియన్ మనోహర్, రిటైర్డ్ జిల్లా విద్యాశాఖాధికారి ఎండీ ఆజాం, రాయబోస్, వేణు, సుమలత, శ్యాం, సురేష్, రాజు, బిక్షపతి, డాక్టర్ రాజేశ్వర్రావు పాల్గొన్నారు.