Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలతో అభ్యర్థుల ఆందోళన
- ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష
- పేపర్-1కు 1,57,496, పేపర్-2కు 1,55,091 మంది హాజరు
- జూన్ 10న ఫలితాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2018 అడ్వాన్స్డ్ రాతపరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తొలిసారిగా జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్షను ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 573 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్డ్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నాపత్రాలు మళ్లీ కఠినంగానే వచ్చినట్టు అభ్యర్థులు, నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. సాగదీత ప్రశ్నలతో అర్థం చేసుకొని జవాబులు కనుక్కోవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం కేటాయించి జవాబు రాబట్టే పనిలో నిమగం కావడంతో ఇతర ప్రశ్నలకు సమయం సరిపోక ఇబ్బంది పడ్డారు. పేపర్-1లో 180 మార్కులు, పేపర్-2లో 180 మార్కులతో ప్రశ్నాపత్రాలు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష 360 మార్కులకు జరిగింది. జనరల్ కేటగిరీ కటాఫ్ తగ్గే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్లో జనరల్ కేటగిరీ కటాఫ్ 128, ఓబీసీలకు 115, ఎస్సీ,ఎస్టీలకు 64 మార్కులున్నాయి. ఈసారి జనరల్ కేటగిరీ కటాఫ్ 120 నుంచి 125 మార్కుల వద్ద ఉండే అవకాశమున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,64,822 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేశారు. వారిలో ఆదివారం జరిగిన ఆన్లైన్ పరీక్షల్లో పేపర్-1కు 1,57,496 మంది, పేపర్-2కు 1,55,091 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1కు 7,326 మంది, పేపర్-2కు 9,731 మంది గైర్హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 28 వేల అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 22 వేల మంది అభ్యర్థులకు పరీక్ష రాసినట్టు తెలిసింది. ఈనెల 25వ తేదీ నాటికి ఓఎంఆర్ జిరాక్స్ ప్రతులను విద్యార్థుల మెయిల్స్కు పంపిస్తారు. ఈనెల 29న జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక కీ విడుదల కానుంది. ఈనెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు ఆన్లైన్లో స్వీకరిస్తామని ఐఐటీ కాన్పూర్ పేర్కొంది. వచ్చేనెల 10న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంకులు విడుదలవుతాయని ప్రకటించింది.