Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు రైతులు...మరొకరు కూలీ
నవతెలంగాణ-జగిత్యాల టౌన్/నర్సంపేట
వరంగల్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు రైతులున్నారు. మరొకరు రోజువారీ కూలీ. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్కి చెందిన సార్గు సురేందర్(69) నాలుగు రోజుల కిందట తనకున్న కొద్దిపాటి వరిపంటను కోసి, ఎండలోనే నూర్పిళ్లు జరిపాడు. ఈ క్రమంలో ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నార్సింగి ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన గొల్లపెల్లి శ్రీనివాస్(33) శనివారం ఉదయం పొలంలో గడ్డి కుప్ప వేయడానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో వడదెబ్బకు గురయ్యాడు. పక్కనున్న చెట్టు కిందకెళ్లి సొమ్మసిల్లిపడిపోయాడు. గమనించిన పక్కపొలం రైతు.. ఫోన్ ద్వారా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. వారు శ్రీనివాస్ను 108లో జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శనివారం రాత్రి కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి...అప్పటికే చనిపోయాడని తేల్చారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల రూరల్ ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి చెందిన కాకి రాములు(41) రోజువారీ కూలీ. రెండ్రోజుల కింద వడదెబ్బతో పనిప్రదేశంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికంగా ట్రీట్మెంట్ అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం చనిపోయాడు.