Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి టీపీఏ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో విఫల ప్రయోగమైన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని విరమించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు టీపీఏ అధ్యక్షుడు నాగటి నారాయణ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీసీఈ అమల్లో జరుగుతున్న లోపాలను సవరిస్తూ ఎస్సీఈఆర్టీ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు, పుస్తక పఠనం, సమకాలీన సమస్యలపై స్పందించడం వంటి అంశాలను సగం తగ్గించడం వల్ల ఒరిగేదేమీ లేదని తెలిపారు. ఈ విధానం ప్రయివేటు స్కూళ్లు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధంగా అమలు చేస్తున్నారని తెలిపారు. 2009 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సీసీఈ ఆది నుండీ అసంతృప్తిగానే నడుస్తోందని పేర్కొన్నారు. పాఠాలు చెప్పడం కంటే సీసీఈ పనులతోనే సమయం సరిపోతోందని తెలిపారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన సదుపాయాలు (లైబ్రరీ, ల్యాబోరేటరీ, కంప్యూటర్, ప్రింటర్ వంటివి) పాఠశాలల్లో లేనందున విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయించడం, తల్లిదండ్రులపై ఆర్థిక భారం, కనీస అభ్యసన సామర్థ్యాలు పెరగడం లేదని సర్వేల నివేదికలు చెప్తున్నాయని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ గత విద్యాసంవత్సరం నుంచే కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఈని ఉపసంహరించిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇదే పనిచేశాయని పేర్కొన్నారు. సీసీఈని సవరించి అమలు చేయాలనే ప్రయత్నాలు మాని ఆ విధానాన్నే విరమించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదో తరగతి వరకు నో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.