Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్సైడెడ్గా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు
- ఒక సామాజికవర్గం చెప్పినట్టే నిర్ణయాలు
- అంతర్గత కుమ్ములాటలపై ఉదాసీనత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియాకు అధిష్టానం చెక్ పెట్టనుందా? పార్టీలో ఒన్సైడెడ్గా వ్యవహరిస్తున్నారా? పార్టీలో బలమైన సామాజిక వర్గం చెప్పిన మాటలు వింటూ నిర్ణయాలు తీసుకుంటున్నారా? దీంతో బీసీ సామాజికవర్గం కుంతియాను టార్గెట్ చేసిందా? పార్టీలో కొనసాగుతున్న పరిణామాలకు సరైన కారణాలు చూపిస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్చ జోరుగా సాగుతున్నది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కొంత మంది నేతల సమాచారమేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తారని తెలిసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం లో కర్నాటక పరిణామాలు ఉత్పన్నమైతే ఆయన డీల్ చేయ లేరనే చర్చ కూడా పార్టీ నేతల్లో జరుగుతున్నది. రాష్ట్రానికి గులాంనబీ ఆజాద్, వాయలార్ రవి, దిగ్విజరుసింగ్ వంటి హేమహేమీలు రాష్ట్ర ఇన్చార్జిగా ఉండి కీలకమైన సమస్యలను పరిష్కరించి పార్టీని ముందుకు నడిపించారు. దిగ్విజరు స్థానంలో కుంతియా ఇన్చార్జిగా వచ్చిన కొత్తలోనే నేతలంతా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాహుల్గాంధీ టీమ్లో సభ్యుడిగా ఉండటంతో నేతలందరిని సమన్వయపరుస్తారని పార్టీ నేతలంతా భావించారు. కాలక్రమేణా ఆయన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, అదే సామాజిక వర్గానికి చెందిన నేతల మాటలకే విలువ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉంటే ఆ సామాజికవర్గంతోనే మాట్లడం, చర్చించడం చేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ నేతలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, తమ బాధలను కూడ వినకపోవడంతో వారంత కుంతియా పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదులివే...
పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో అత్యధికం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉండటం గమనార్హం. బీసీ అభ్యర్థులు ఉన్నప్పటికి వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా అభ్యర్థులను ప్రకటించడం వెనక కుంతియా హస్తం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి జగ్గారాఘవరెడ్డి, నిర్మల్ మహేశ్వరరెడ్డి, ఆర్మూర్ కేఆర్ సురేష్రెడ్డి, హుస్నాబాద్కు ప్రవీణ్రెడ్డిని ప్రకటించారు. ఇబ్రహింపట్నం అభ్యర్థిగా క్యామమల్లేష్ ఉండగా, మల్రెడ్డి రంగారెడ్డి కూడా హామీ ఇచ్చారు. బాల్కొండలో మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్కుమార్గానీ, ములుగు, ఇల్లెందుల, పెద్దపల్లి, ఎందుకు ప్రకటించలేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క చోట ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు కూడా బరిలో ఉండగా కేవలం ఆ సామాజికవర్గానికి చెందిన పేర్లు ప్రకటించడానికి కుంతియా ఎలా అనుమతి ఇస్తారన్నది వారి ఆరోపణ.
రచ్చకెక్కిన కుమ్ములాటలు
బీజేపీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న లీకులతో పార్టీ రచ్చకెక్కింది. ఆ జిల్లా నేతలు నాగం వ్యతిరేక, అనుకూలంగా గ్రూపులుగా చీలిపోయారు. మీడియా ప్రెస్కాన్ఫరెన్స్లు పెట్టి ఆరోపణలు చేసుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, ఎంపి నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదరరెడ్డి వ్యతిరేకిస్తుండగా, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్రెడ్డి స్వాగతించారు. నాగంకు కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్రెడ్డి మద్దతు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత తతంగం జరుగుతున్నా...కుంతియా ఏమీ పట్టనట్టు వ్యవహరించారని నేతల్లో చర్చ జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా చొరవ చూపలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓబీసీ వర్సెస్ బీసీ సాధికారత కమిటీ
మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ చైర్మెన్గా ఓబీసీ విభాగం కొనసాగుతుండగానే కుంతియా అనుమతిమేరకు టీపీసీసీ నాయకత్వం బీసీ సాధికారిత కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో ఓబీసీ వర్సెస్ బీసీ సాధికారత కమిటీలను నియమించి బీసీల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల కొట్లాటలతో ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్కు బీసీ కుంపట్లు తలనొప్పిగా మారాయి. దీంతో బీసీలంటే రాష్ట్ర నాయకత్వానికి లెక్కతనం ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అంతర్గత సమావేశంలోనే వాపోయారు.
కర్నాటక ఎపిసోడ్ తర్వాతే!
పలు ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మార్పు ఉండొచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కర్నాటక ఎపీసోడ్ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిసిది. కర్నాటక ఫలితాలతో దక్షణాది రాష్ట్రాల్లో అవసరమైతే పీసీసీ అధ్యక్షులను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే పరిస్థితి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత అంటున్నారు.