Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ వెల్లడి
- మరిన్ని ఆస్తుల కోసం సాగుతున్న దర్యాప్తు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
లంచాలు మరిగిన ఆర్టీఓ వద్ద భారీ మొత్తంలోనే అక్రమాస్తులు కూడా ఉన్నాయని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన సోదాలలో వెల్లడైనట్టు తెలిసింది. ఏసీబీ అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఖురేషీ అనే వ్యక్తి యాక్సిడెంట్కు గురైన తన కారు రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరితే అందుకు ఆరు వేల రూపాయలను మలక్పేట్ ఆర్టీఓ నాగరాజు తీసుకుంటూ శనివారం పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇందుకు సహకరించిన హోంగార్డ్ వెంకటరమణ, మరో ప్రయివేటు వ్యక్తి శివశంకర్గౌడ్లను కూడా ఏసీబీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే అందిన సమాచారంతో మారెడ్పల్లిలోని ఆర్టీఓ నాగరాజు నివాసంపైనా ఏసీబీ అధికారులు దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో నాగరాజు నివాసంలో కిలోన్నర బంగారు నగలు, ఆరు లక్షల రూపాయల నగదు ఏసీబీ అధికారులకు చిక్కాయి. అలాగే కొన్ని బ్యాంకులలో ఖాతాలు, లాకర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూముల దస్త్రాలు కూడా బయటపడినట్టు తెలిసింది. వీటన్నింటిని క్రోడీకరిస్తూ ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా తదుపరి దర్యాప్తును ఈ కేసులో సాగిస్తున్నారని తెలిసింది. అంతేగాక లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్గా దొరికిన ట్రాప్ కేసుతో పాటు ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నట్టుగా మరో కేసును కూడా నాగరాజుపై నమోదు చేస్తున్నారని తెలిసింది. నాగరాజు కేసులో తదుపరి దర్యాప్తు సాగుతున్నదని, అదనంగా వచ్చిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అక్రమాస్తల గురించి ఆరా తీస్తున్నామని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు తెలిపారు.