Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ రామచంద్రమూర్తి 70వ జన్మదిన వేడుకల్లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సామాజిక సృహ, చైతన్యం, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టేందుకు డాక్టర్ కె రామచంద్రమూర్తి జర్నలిజాల్ని ఆయుధంగా వినియోగించుకున్నారని పలువురు వక్తలు ప్రసంసించారు. సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కె రామచంద్రమూర్తి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఆయన జర్నలిజంలోకి ప్రవేశించి 50 సంవత్సరాలు ఏండ్లు గడిచిన సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మాజీ కేంద్రమంత్రులు ఎస్ జైపాల్రెడ్డి, బండారు దత్తాత్రేయ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, టీఎస్పీఎస్సీ చైర్మెన్ గంటాచక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమ్మెస్కే విజయకుమార్, బీ ప్రకాష్, నవతెలంగాణ, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికా సంపాదకులు ఎస్ వీరయ్య, ఎమ్ శ్రీనివాస్, కట్టా శేఖర్రెడ్డి సీనియర్ పాత్రికేయులు కె శ్రీనివాసరెడ్డి, వల్లీశ్వర్, దేవీప్రియ, రాఘవాచారి, ప్రొఫెసర్ సత్యనారాయణ తదితరులు డాక్టర్ కె రామచంద్రమూర్తికి జన్మదిన శుభాభినందనలు తెలుపుతూ ప్రసంగించారు. 'భారతీయ జర్నలిజం-50 వసంతాలు' అంశంపై సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట నారాయణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు పలు అంశాలను ప్రస్తావించారు. జర్నలిజం-వృత్తి విలువలు, ప్రస్తుత పరిణామాలు, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా రామచంద్రమూర్తి పోషించిన పాత్ర వంటి అంశాలతో పాటు ఆయనతో తమకున్న సాన్నిహిత్యం, నేర్చుకున్న గుణపాఠాలు, వృత్తిలో నిబద్ధత వంటి విషయాలను సభికులతో పంచుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో వాస్తవాలు వెల్లడికాకపోవచ్చని, కానీ రామచంద్రమూర్తి వంటి నిబద్ధత కలిగిన జర్నలిస్టులు పాలకవర్గాలకు చురకలు వేస్తూనే ఉంటారని అన్నారు. ఇది బాధ్యతాయుత పాలనకు దారితీస్తుందని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజంలో యాజమాన్యాల జోక్యం పెరిగిందని, వాస్తవాలు, అవాస్తవాల మధ్య సందిగ్ధత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాడ వెంటకరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు దాన్ని పరిరక్షించే బాధ్యత జర్నలిజంపై ఉందన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో 'దశ-దిశ' కార్యక్రమాన్ని నిర్వహించి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు వ్యాప్తి చెందకుండా రాష్ట్ర విభజన, శాంతి చర్చలకు దోహదం చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి రాసిన 'త్రికాలం' సంకలనాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 50 ఏండ్లలో అనేకమంది ప్రజాప్రతినిధులు, సంఘాలుతో కలిసి పనిచేశానని, ఎప్పుడు, ఎవరిపై విమర్శ చేసినా అందరూ దాన్ని సద్విమర్శగానే స్వీకరించారని చెప్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.