Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల బకాయిలు
- నాలుగేండ్లుగా పేరుకుపోతున్న వైనం
- రైతుల నుంచి వసూలు చేసే ఆలోచనలో బ్యాంకులు
నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి
రాష్ట్ర సర్కారు నాలుగేండ్లుగా బ్యాంకులకు తనవాటా వడ్డీ రాయితీ డబ్బులివ్వట్లేదు. ఏకంగా రూ.వెయ్యికోట్ల బకాయి పేరుకుపోయింది. సర్కారు నుంచి వడ్డీ బకాయిలు రాకపోవటంతో రైతుల నుంచి వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. ప్రతి యేటా బ్యాంకుల నుంచి వ్యవసాయం కోసం రైతులు తీసుకునే రుణాలపై ప్రభుత్వం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇవ్వడం నిరంతరంగా సాగుతోంది. ఆ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి గడ్డుకాలం ఏర్పడింది. ఆ ఏడు శాతం రాయితీలో కేంద్రం మూడు శాతం చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు శాతం రాయితీ నాలుగేండ్లుగా పెండింగ్లో ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే కేడీసీసీ బ్యాంకు పరిధిలో లక్షా 23 వేల మంది రైతులకు ప్రతి యేటా పంట రుణాలిస్తున్నారు. ఇందులో యేటా ప్రభుత్వం చెల్లించాల్సిన 4శాతం వడ్డీ రాయితీ రూ.16 కోట్ల చొప్పున నాలుగేండ్లకు గాను రూ.64 కోట్లు పేరుకుపోయింది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ సహకార బ్యాంకులు మాత్రం పాత జిల్లాల పరిధిలోనే పని చేస్తున్నాయి. ఆ బ్యాంకులు హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 9 బ్యాంకుల పరిధిలో రూ.350 కోట్ల వడ్డీ రాయితీ పేరుకుపోయినట్టు తెలుస్తోంది. వాణిజ్య బ్యాంకులపరంగా మరో రూ.250 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ కలిపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్ల వడ్డీ రాయితీ రావాల్సి ఉంది.
బ్యాంకులు సీజన్ పరంగానే కాకుండా దీర్ఘకాలిక రుణాలూ అందిస్తున్నాయి. ఇందులో వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు రుణాలిస్తున్నాయి. వాటితో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, కరెంటు మోటార్లు కొనుగోలు చేయడంతో పాటు డెయిరీ, ఉద్యానవనాలకు సైతం రైతులు రుణాలు తీసుకుంటున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 వేల మంది రైతులకు కేడీసీసీ బ్యాంకు నుంచి ప్రతియేటా రుణాలిస్తున్నారు. ఇలాంటి అవకాశం వాణిజ్య బ్యాంకుల్లో లేదు. ఈ రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం 6 శాతం చొప్పున వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉంది. ఈ రాయితీ 2008-09 నుంచి అందడం లేదు. దీంతో సుమారు రూ.40 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే దీర్ఘకాలిక రుణాల వడ్డీ రాయితీ బకాయిలు రూ.400 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా రెండు రకాల రుణాలు కలిపి ఆయా బ్యాంకులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ రూ.వెయ్యి కోట్లకు చేరుకుంది. దీంతో బ్యాంకులు తలలు పట్టుకున్నాయి.
రైతుల నుంచి వసూలుకు యోచన
ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున వడ్డీ రాయితీ పేరుకుపోవడంతో బ్యాంకుల నిర్వహణ భారంగా మారింది. సహకార బ్యాంకులు రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని రైతులకు రుణాలు ఇస్తుంటాయి. అపెక్స్ బ్యాంకు నాబార్డు నుంచి రుణం తెచ్చుకుంటుంది. ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లించకపోయినా బ్యాంకులు మాత్రం నాబార్డుకు ఇవ్వక తప్పడం లేదు. సాధారణంగా బ్యాంకుల నిర్వహణ వడ్డీలపైనే కొనసాగుతుంది. అవి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు నివేదించినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ క్రమంలో రైతుల నుంచే వసూలు చేసే విషయమై ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయి.
నిర్వహణ కష్టమైతంది...
నాలుగేండ్లుగా వడ్డీ రాయితీ రాని మాట వాస్తవమే. దీర్ఘకా లిక రుణాలు కేవలం మా బ్యాంకు ద్వారా మాత్రమే ఇస్తున్నాం. పంట రుణాలు 50శాతం మేమే అందిస్తున్నాం. మిగిలిన 50 శాతమే అన్ని వాణిజ్య బ్యాంకులు కలిసి ఇస్తున్నాయి. అందువల్ల రైతులకు ఎక్కువ శాతం వెన్నుదన్నుగా మేమే నిలుస్తున్నాం. వాణిజ్య బ్యాంకులు ఇతరత్రా వ్యవహారాలు నిర్వహణతో నెట్టుకు రాగలవు. మేము పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలకే పరిమిత మయ్యా'ం. నిర్వహణ కష్టమైతాంది. అందువల్ల వడ్డీ రాయితీ వస్తేనే మాబ్యాంకు నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
- ఎన్.సత్యనారాయణరావు, కేడీసీసీ బ్యాంక్ సీఈవో